iDreamPost

చెల్లని ఓటుతో బాబు కి మరో ఝలక్ ఇచ్చిన ఆ ఎమ్మెల్యే ఎవరు?

చెల్లని ఓటుతో బాబు కి మరో ఝలక్ ఇచ్చిన ఆ ఎమ్మెల్యే ఎవరు?

రాజ్యసభ ఎన్నికలు టీడీపీ గాలి తీసేశాయి. ఉన్న పరువు మరింత దిగజార్చాయి. అసలే 23 మంది ఎమ్మెల్యేల్లో 21 మంది ఓట్లు వేశారు. అందరికీ విప్ జారీ చేయడంతో తిరుగుబాటు ఎమ్మెల్యేల ను ఇరకాటంలో పెట్టవచ్చని చంద్రబాబు ఆశించారు. కానీ ఫలితాలు ఆయనకు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఓట్లేసిన 21 మందిలో ముగ్గరు ఎమ్మెల్యేలు టిక్ మార్క్ పెట్టేశారు. టీడీపీ అభ్యర్థి దగ్గర ఓటు వేసినట్టు సాంకేతికంగా చెల్లని ఓటు జాబితాలో చేరిపోయింది. ముగ్గురు పోయినా సరే అనుకుంటే మరొకరు ఓటింగ్ కి ఢుమ్మా కొట్టడం, ఓటేసిన ఒక ఎమ్మెల్యే ఓటు చెల్లని ఓటు జాబితాలో చేరడం గమనిస్తే టీడీపీ నుంచి మరికొన్ని టికెట్లు జారిపోతున్నట్టుగా కనిపిస్తోందని అంచనాలు వేస్తున్నారు.

Also Read: రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసిన కరోనా పాజిటివ్ ఎమ్మెల్యే

ఇప్పటికే అనగాని సత్యప్రసాద్ ఓటు వేయడానికి అడ్డంకులు లేకపోయినా హాజరుకాకపోవడం టీడీపీ నేతలకు అంతుబట్టడం లేదు. ఆయన తీరు మీద టీడీపీ శిబిరంలో సందేహాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి కి తోడుగా చెల్లని ఓటు వేసిన మరో ఎమ్మెల్యే ఎవరనేది అంతుబట్టకుండా మారింది. వాస్తవానికి టీడీపీ ఎమ్మెల్యేలలో అత్యధికులు సీనియర్లు. పలు మార్లు ఓటు హక్కు వినియోగించుకున్న నేతలే. కాబట్టి చెల్లని ఓట్లకు అవకాశాలు స్వల్పం. అయినప్పటికీ ఉద్దేశ పూర్వకంగా తన ఓటుని చెల్లని ఓట్ల జాబితాలో చేర్చిన ఆ ఒక్క ఎమ్మెల్యే ఉత్తరాంధ్రకి చెందిన వారిగా అనుమానిస్తున్నారు.

Also Read: ముగిసిన రాజ్యసభ పోలింగ్‌ : అందరి దృష్టి ఆ నలుగురిపైనే..!

ఇది ఇప్పుడు తెలుగుదేశానికి కొత్త తలనొప్పి తెస్తోంది. కనీసంగా 21 ఓట్లు వస్తాయని ఆశించిన చోట కేవలం 17 ఓట్లు మాత్రమే టీడీపీ అభ్యర్థికి దక్కడం గమనిస్తే తెలుగుదేశం అధినేతకు సభలో విపక్ష హోదా కూడా మిగలలేదని చెప్పవచ్చు. చంద్రబాబు నైతికంగా తన స్థాయిని దిగజార్చుకున్నట్టుగా చెప్పవచ్చు. కోరి కష్టాలు కొనితెచ్చుకున్న బాబు వ్యూహం బెడిసికొట్టడంతో తలబొప్పికొట్టినట్టుగా కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి