iDreamPost

నేడు సుప్రీం కోర్టులో నిమ్మగడ్డ కేసు: ఏం కాబోతుందో…?

నేడు సుప్రీం కోర్టులో నిమ్మగడ్డ కేసు: ఏం కాబోతుందో…?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసి) నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై దాఖలు అయిన పిటిషన్ నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ )దాఖలు చేసింది. దీనిపై ఈ రోజు సర్వోన్నత ‌న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

రాష్ట్రంలో గత రెండు నెలలుగా ఎన్నికల కమిషనర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఎస్ఈసిగా నిమ్మగడ్టను తొలగిస్తూ…నూతన కమిషనర్‌గా జస్టిస్ కనగరాజ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దీనిపై రాష్ట్ర హైకోర్టు కోర్టు తీర్పు ఇచ్చింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్నే కమిషనర్‌గా చేయాలని, నూతన కమిషనర్ నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ తీర్పు తరువాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తీర్పు వెలువడిన వెంటనే నిమ్మగడ్డ బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకుండానే హైకోర్టు తీర్పు తర్వాత రమేశ్‌ కుమార్‌ తిరిగి బాధ్యతలు చేపట్టినట్లు ఎన్నికల కమిషన్‌ సర్క్యులర్‌ జారీ చేసింది. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన అడ్వకేట్ జనరల్ శ్రీ రాం..రమేశ్‌ కుమార్‌ పునర్నియామకం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. దీంతో రమేశ్‌ కుమార్‌ పునర్నియామకానికి బ్రేకులు పడ్డాయి.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నియామక ఉత్తర్వులు రాకుండానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు తనే భాద్యతలు స్వీకరిస్తున్నట్లు ప్రకటించడం…దానిపై ఉత్తర్వులు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించడంతో…ఆయన బాధ్యతలు చేపట్టినట్లు ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ప్రకటించారు.

అయితే నిమ్మగడ్డ విషయం కోర్టులో ఉంది. దానిపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎల్లో మీడియా తాజాగా మరో ఎన్నికల కమిషనర్ ను తెరపైకి తెచ్చింది.

ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మద్దతుగా నిలిచిన ఎల్లో మీడియా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుంకాలు పుంకాలుగా కథనాలు రాస్తుంది. టీవీల్లో ప్రచారం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా…ప్రతిపక్ష టిడిపికి అనుకూలంగా ఇలాంటి కథనాలు రాయడంలో ఎల్లో మీడియాకు మరెవ్వరూ తీసిపోరు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ ను తెరపైకి తీసుకొచ్చింది. తమకు తాము ఊహించుకొని కథనాలు రాసేశారు. రమేశ్‌ కుమార్‌ మళ్లీ కమిషనర్‌ కుర్చీలో కూర్చోకుండా అడ్డుకునేందుకే ఈ వ్యూహం రచిస్తోందని, కొత్త కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ను నియమించేలా కసరత్తు చేస్తోందని ఎల్లో మీడియా రాసేసింది. ప్రభుత్వంలోని వారికే తెలియని ఈ అంశాన్ని ఎలా రాసిందో తెలియదు గాని…రాష్ట్రానికి మరో ఎన్నికల కమిషనర్ ను ప్రకటించింది.

వాస్తవానికి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించడం సర్వ సాధారణం. గత చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇలానే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై బిజెపి, కాంగ్రెస్ పార్టీల నేతలు కేవియట్ దాఖలు‌ చేశారు. ఈ కేసు బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి