iDreamPost

ఏం తప్పు చేశానో తెలియదు : చంద్రబాబు

ఏం తప్పు చేశానో తెలియదు : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఆ ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు ఘోర ఓటమి పాలయ్యారు. ప్రజలు స్పష్టమైన అవగాహనతో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీకి ఎందుకు ఓటు వేయకూడదు..? వైసీపీకే ఎందుకు వేయాలి..? అనే క్లారిటీ ప్రజల్లో ఉంది. అందుకే వైసీపీకి 175 సీట్లకు గాను 151 సీట్లు కట్టబెట్టారు.

ప్రజలు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు మైండ్‌ బ్లాక్‌ అయిందనే చెప్పాలి. ప్రజలు తనను ఎందుకు ఆదరించలేదో తెలిసినప్పటికీ.. ఆయా కారణాలను మాత్రం బాబు పైకి చెప్పడం లేదు. ఇప్పటికీ కూడా నాకు ఓట్లు ఎందుకు వేయలేదో అనే మాటనే బాబు వల్లెవేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత నేనేలా ఓడిపోయానో తెలియడం లేదన్న బాబు గారిని ఓదార్చేందుకు రోజుల తరబడి మహిళలు ఆయన ఇంటికి వెళ్లారు. మీరెట్లా ఓడిపోయారయ్యా అంటూ మహిళలు చెప్పిన డైలాగ్‌ అప్పట్లో ఫేమస్‌ అయింది.

ఎన్నికల ఫలితాలను ఈ రోజు చంద్రబాబు మరోమారు గుర్తు చేసుకున్నారు. కృష్ణా జిల్లా పరిటాల గ్రామంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు.. ‘‘ప్రజలు పూనకం వచ్చినట్లు జగన్‌కు ఓట్లు వేశారు. నేను ఏమి తప్పు చేశానో తెలియడం లేదు’’ అంటూ నిట్టూర్చారు. ప్రజలు అభివృద్ధి చెందాలని కృషి చేశాను.. అదే తప్పైతే నన్ను క్షమించండి’’ అంటూ కూడా చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కారు.

టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని, చంద్రబాబుపై ఇంకా అంతో ఇంతో నమ్మకం ఉన్న తెలుగుదేశం పార్టీలోని కొంత మంది కార్యకర్తలకు తాజాగా బాబు చేసిన వ్యాఖ్యలతో ఓ క్లారిటీ వచ్చేసింది. ఏ పార్టీ అయిన ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను అన్వేషించి.. తిరిగి ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు పని చేస్తుంది. కానీ బాబు గారు మాత్రం చేసిన తప్పులు ఏమిటో తెలిసినా.. వాటిని ఒప్పుకునేందుకు మాత్రం మనసు రావడంలేదని ఈ రోజు చేసిన వ్యాఖ్యలతో తమ్ముళ్లకు కూడా అర్థమైంది.

2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమిటి..? అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసినవి ఎన్ని..? అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. దాదాపు 650 హామీలు ఇచ్చిన బాబు గారు.. వాటిలో అమలు చేసినవి ఎన్ని..? ఎంత మేర చేశారు..? అనేది బాబుకు తెలియంది కాదు. ఇచ్చిన మాట తప్పడం వల్లే ప్రజలు గుణపాఠం చెప్పారనేది జగమెరిగిన సత్యం. అయినా బాబు మాత్రం ఇవేమి ఆలోచించడం లేదు. పైగా ప్రజల అభివృద్ధికి కృషి చేయడమే తన తప్పు అయితే.. క్షమించండి అనే సన్నాయి నొక్కుళ్లకు కాలం చెల్లిందనే విషయం బాబు గుర్తిస్తేనే తమకు, తమ పార్టీకి పూర్వ వైభవం అని తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారు. చేసిన తప్పులను ఒప్పుకుంటేనే ప్రజలు హర్షిస్తారనే విషయం బాబు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదంటున్నారు.

ప్రజలకు పూనకం వచ్చినట్లు జగన్‌కు ఓట్లేశారని కూడా బాబు అన్నారు. ఇలా ఎందుకు వేశారు..? అంటే జగన్‌పై ఉన్న విశ్వసనీయతేనంటారు. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేయకుండా.. తనకు అధికారం ఇస్తే ఏం చేస్తాననేది వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారు. వైఎస్సార్‌ వారసుడును ప్రజలు విశ్వసించారు. అందుకే బాబు అన్నట్లుగా.. పూనకం వచ్చినట్లు ఓట్లు వేశారు. ఇచ్చిన మాటను జగన్‌ నిలబెట్టుకుంటున్నారు. కేవలం రెండు పేజీలతో ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 90 శాతానికి పైగా అమలు చేశారు. జగన్‌ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాల ఫలాలను ప్రజలు అందుకుంటున్నారు. తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని జగన్‌ నిలబెట్టుకుంటున్నారు. చెప్పిన మాట నిలబెట్టుకున్నాను.. ఇచ్చిన హామీ నెరవేర్చాను.. అంటూ జగన్‌ రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేయాలని అడుగుతారు. మరి చంద్రబాబు ఏమి చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతారు..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి