iDreamPost

IPL 2022 : అప్పుడు సచిన్.. ఇప్పుడు శుబ్‌మన్‌ గిల్‌..

IPL 2022 : అప్పుడు సచిన్.. ఇప్పుడు శుబ్‌మన్‌ గిల్‌..

IPL 2022లో మంగళవారం టేబుల్ టాప్ జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగగా గుజరాత్ 62 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గుజరాత్ తరపున రషీద్‌ ఖాన్‌ 4 వికెట్లు తీసి ఈ మ్యాచ్ విజయంలో పాలు పంచుకున్నాడు. ఇక బ్యాటింగ్ లో శుబ్‌మన్‌ గిల్‌ ‌63 పరుగులు చేసి గుజరాత్ విజయంలో భాగమయ్యాడు.

అయితే ఈ మ్యాచ్ లో శుబ్‌మన్‌ గిల్‌ సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డుని సమం చేశాడు. 2009లో చెన్నై సూపర్ కింగ్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున సచిన్ ఓపెనర్‌గా దిగి 49 బంతుల్లో 7 ఫోర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 20 ఓవర్ల పాటు క్రీజులో బ్యటింగ్ చేశాడు. 20 ఓవర్లపాటు క్రీజులో ఉండి ఒక్క సిక్స్ కొట్టకుండానే హాఫ్‌ సెంచరీ సాధించాడు.

గుజరాత్ టైటాన్స్, లక్నో మ్యాచ్ లో కూడా ఓపెనర్‌గా క్రీజులోకి దిగిన గిల్‌ కూడా 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి 49 బంతుల్లో 7 ఫోర్లతో 63 పరుగులు చేశాడు. గిల్‌ ఇన్నింగ్స్‌లో కూడా సచిన్‌ లాగే 20 ఓవర్లు క్రీజులో ఉండి, 49 బంతులని ఎదుర్కొని, ఒక్క సిక్సర్ కూడా కొట్టకుండా హాఫ్ సెంచరీ చేయడం విశేషం. దీంతో IPL చరిత్రలో 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి ఒక్క సిక్సర్ కూడా కొట్టని రెండో బ్యాట్స్‌మెన్‌గా గిల్ సచిన్ సరసన నిలిచాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి