iDreamPost

సాయితేజ్ టైటిల్ తో షారుఖ్ ఖాన్

సాయితేజ్ టైటిల్ తో షారుఖ్ ఖాన్

మూడేళ్ళకు పైగా గ్యాప్ తో వెండితెరకు దూరంగా ఉంటున్న కింగ్ షారుఖ్ ఖాన్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే ఈ ఆలస్యాన్ని భర్తీ చేసేలా వరస ప్రాజెక్టులు చేస్తున్న షారుఖ్ వాటిలో ఒకటి తమిళ దర్శకుడు ఆట్లీతో చేస్తున్న సంగతి తెలిసిందే. రాజారాణి తర్వాత విజయ్ తో వరసగా తేరి(పోలీసోడు), మెర్సల్(అదిరింది), బిగిల్(విజిల్)తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సాధించిన ఆట్లీ ఏకంగా షారుఖ్ కంట్లో పడ్డాడు. తను చెప్పిన లైన్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా అఫీషియల్ కాలేదు కానీ ఇప్పుడో లీక్ హల్చల్ చేస్తోంది.

దాని ప్రకారం ఈ సినిమాకు జవాన్ టైటిల్ ని లాక్ చేశారట. ఇది మన సాయితేజ్ గతంలో వాడుకున్న పేరు. బివిఎస్ రవి డైరెక్షన్ లో రూపొందిన ఆ మూవీ అప్పట్లో ఫ్లాప్. కానీ దాని గురించి నార్త్ ఆడియన్స్ కి తెలిసింది తక్కువ కాబట్టి ఇబ్బందేమీ లేదు. షారుఖ్ ప్రస్తుతం పఠాన్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. 2023 జనవరి విడుదల ఆల్రెడీ అధికారికంగా చెప్పేశారు కాబట్టి వీలైనంత వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. దీంతో పాటు రాజ్ కుమార్ హిరానీతో చేస్తున్న డుంకీ మీద అనౌన్స్ మెంట్ టైం నుంచే అంచనాలు ఎక్కడికో ఎగబాకుతున్నాయి. ఇది కూడా లేట్ చేయకుండా చకచకా షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ ఉంటుంది.

మంచి లైనప్ తో పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ కు పెద్ద బ్లాక్ బస్టర్ అవసరం చాలా ఉంది. గత సినిమాలు జీరో, జబ్ హ్యారీ మెట్ సెజల్, రయీస్, డియర్ జిందగీ, ఫ్యాన్ అన్నీ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ కావడంతో మార్కెట్ బాగా ఎఫెక్ట్ అయ్యింది. తన స్థాయికి తగ్గ సినిమాలు ఎంచుకోవడం లేదని అభిమానులు సైతం అసంతృప్తిగా ఉన్నారు. అందుకే పఠాన్, జవాన్ లతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. ఇక ప్యాన్ ఇండియా స్థాయిలో తన పేరు మారుమ్రోగిపోవడానికి ఆట్లీ దీన్నో మంచి అవకాశంగా చూస్తున్నాడు. గురి సరిగ్గా కుదిరిందంటే అక్కడే సెటిలైపోవచ్చు. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లను డైరెక్ట్ చేసే ఛాన్సూ కొట్టేయొచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి