iDreamPost

డైరెక్టర్​తో సీక్రెట్ మ్యారేజ్​ అంటూ వార్తలు.. స్పందించిన సాయి పల్లవి!

  • Author singhj Published - 07:20 PM, Fri - 22 September 23
  • Author singhj Published - 07:20 PM, Fri - 22 September 23
డైరెక్టర్​తో సీక్రెట్ మ్యారేజ్​ అంటూ వార్తలు.. స్పందించిన సాయి పల్లవి!

చిత్రసీమలోకి ఎంతో మంది నటీనటులు వస్తుంటారు. కానీ వారిలో కొందరు మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు. అందులోనూ ఇంకొందరు మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి కోవలోకి చెందిన నటే సాయి పల్లవి. యూత్​లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. నెమలిలా నాట్యం చేస్తూ, సహజమైనం అందం, అభినయంతో ఆడియెన్స్​ మనసుల్ని దోచుకున్నారు సాయి పల్లవి. వరుసగా ఆఫర్లు వచ్చినా మూవీస్ విషయంలో చాలా సెలెక్టివ్​గా ఉంటారామె. ఏది పడితే అది కాకుండా తన మనసుకు నచ్చిన కథలు, పాత్రల్నే ఎంచుకుంటూ కెరీర్​ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారామె. అలాంటి సాయి పల్లవికి ఓ దర్శకుడితో పెళ్లి అయ్యిందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.

సాయి పల్లవికి మ్యారేజ్ అయిందని, ఆమె పెళ్లి చేసుకుంది ఎవర్నో తెలుసా? అంటూ కొద్ది రోజులుగా పలు యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా మాధ్యమాల్లో హెడ్​లైన్స్​, ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. డైరెక్టర్ రాజ్​కుమార్ పెరియస్వామితో సాయి పల్లవికి పెళ్లయిందంటూ ఒక ఫొటోను కొందరు నెటిజన్స్ ప్రచారం చేస్తున్నారు. అయితే ‘ఎస్​కే 21’ అనే వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతున్న మూవీ పూజ కార్యక్రమంలో తీసిన ఫొటో ఇదని తెలిసింది. ఈ విషయంపై ఇప్పటికే దర్శకుడు వేణు ఊడుగుల క్లారిటీ ఇచ్చారు. తాజాగా సాయి పల్లవి కూడా ఈ రూమర్స్​పై స్పందించారు.

రూమర్స్​ను నేను అంతగా పట్టించుకోను. కానీ నా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల్ని కూడా ఇందులో భాగం చేస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పందిస్తున్నా. నేను యాక్ట్ చేసిన ఓ చిత్రం పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను క్రాప్ చేసి, డబ్బుల కోసం నీచమైన ఉద్దేశాలతో వీటిని ప్రచారం చేస్తున్నారు. నా మూవీస్​కు సంబంధించి మంచి అప్​డేట్స్ షేర్ చేసేందుకు రెడీ అవుతున్న టైమ్​లో ఇలాంటి పనికిమాలిన విషయాలపై స్పందించాల్సి రావడం నిజంగా బాధాకరం. ఒక వ్యక్తిని ఇంతలా ఇబ్బంది పెట్టడం నిజంగా నీచమైన చర్యే’ అని సాయి పల్లవి అసహనం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: భర్తతో కలసి గణేషుడ్ని దర్శించుకున్న సన్నీ లియోన్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి