iDreamPost

సిద్దాను నలిపేసిన రామరాజు

సిద్దాను నలిపేసిన రామరాజు

నిన్న ఓటిటిలో రెండు రామ్ చరణ్ సినిమాలు ఒకేసారి స్ట్రీమింగ్ జరగడం మెగాభిమానులను ఆనందంలో ముంచెత్తింది. అయితే దీని వల్ల జరిగిన లాభం ఎంత ఉందో నష్టం కూడా అంతే జరిగింది. ఆర్ఆర్ఆర్ మేనియాలో ఉన్న ఫ్యాన్స్ ఆచార్యను అసలు పట్టించుకోలేదని ట్రెండ్స్ ని బట్టి చూస్తే అర్థమైపోతోంది. అమెజాన్ ప్రైమ్ ఎంత పబ్లిసిటీ చేసినా, విస్తృతంగా ప్రమోషన్లు చేసినా ప్రయోజనం లేకపోయింది. 21 రోజులకే రిలీజ్ చేయడం కోసం కొణిదెల మ్యాట్నీ సంస్థలకు సుమారు 18 కోట్లను అదనంగా ఇచ్చిందన్న వార్త కొద్దిరోజుల క్రితమే వైరల్ అయ్యింది. ఇంత ఖర్చు పెట్టినప్పుడు డేట్ విషయంలో జాగ్రత్తగా పడాల్సింది.

ఇక ఆర్ఆర్ఆర్ అన్ని భాషల్లోనూ అందుబాటులోకి రావడంతో జీ5, నెట్ ఫ్లిక్స్ లు ప్రైమ్ ని పూర్తిగా డామినేట్ చేశాయి. థియేటర్లో చూసినవాళ్లు చూడని వాళ్ళు అందరూ ట్రిపులార్ కే ఓటేశారు. కొద్దోగొప్పో ఆచార్య షో వేసుకున్న వాళ్లకు ఫస్ట్ హాఫ్ కే చుక్కలు కనిపించి ఇదేం సినిమా అంటూ విమర్శించడం సోషల్ మీడియాలో కనిపించింది. ఒకవేళ ఏ పోటీ లేని టైంలో ఆచార్యను కనక డిజిటల్ రిలీజ్ చేసి ఉంటే ఎంత డిజాస్టర్ అయినా సరే ఓసారి చరణ్ చిరులను చూద్దామని అనుకునేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఆచార్యని హిందీ మినహాయించి తమిళం మలయాళం కన్నడంలో ప్రత్యేకంగా డబ్ చేయించినా ఫలితం దక్కకపోవడం బ్యాడ్ లక్.

ఆర్ఆర్ఆర్ ఓటిటిలో ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో కొద్దిరోజులు ఆగితే తెలుస్తుంది. జీ5 సబ్స్క్రైబర్స్ భారీ పెరగొచ్చనే అంచనా ఉంది. నెట్ ఫ్లిక్స్ కేవలం హిందీ వెర్షన్ మాత్రమే కాబట్టి నార్త్ నుంచి ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఏది ఏమైనా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న సినిమాకు ఓటిటిలో ఇంత టఫ్ కాంపిటీషన్ రావడం అరుదు. రాబోయే రోజుల్లో ఇదో ట్రెండ్ గా మారినా ఆశ్చర్యం లేదు. ఎప్పుడైనా చూసే వెసులుబాటు ఉన్నప్పటికీ మొదటి రోజు చూస్తేనే కిక్ అనే తరహాలో ఓటిటి ఫ్యాన్స్ తయారయ్యారు. ఈ లెక్కన ప్రతి శుక్రవారం కేవలం బాక్సాఫీస్ సినిమాల రికార్డులే కాదు ఇకపై ఓటిటిల వ్యూస్ కూడా లెక్కబెట్టుకోవాల్సి ఉంటుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి