iDreamPost

ఇండస్ట్రీలో విషాదం.. చక్ దే ఇండియా నటుడు కన్నుమూత

ఇండస్ట్రీలో విషాదం.. చక్ దే ఇండియా నటుడు కన్నుమూత

వరుసగా సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జైలర్ నటుడు మారిముత్తు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. నిర్మాత ముకేశ్ ఉదేశీ కిడ్నీ సంబంధిత సమస్యలతో కన్నుమూసిన సంగతి విదితమే. స్టార్ కమెడియన్ కుమార్ ఖోస్లా కూడా ఇటీవల మరణించారు. మాలీవుడ్ మెగా స్టార్ మమ్ముట్టి సోదరి అమీనా కూడా తుది శ్వాస విడిచారు. ఈ వార్తలన్నీ మర్చిపోక ముందే గడిచిన కొన్ని గంటల్లోనే కొంత మంది సినీ ప్రముఖుల మరణ వార్తలు వినిపించాయి. టాలీవుడ్ హిట్ చిత్రాల నిర్మాత గోకినేని ప్రసాద్ అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రముఖ కన్నడ దర్శకుడు వీఆర్ భాస్కర్ ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. ఇటు టాలీవుడ్, అటు శాండిల్ వుడ్ ఈ మరణ వార్తలతో శోక సంద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు మరో నటుడు మృతి చెందారన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది.

బాలీవుడ్ నటుడు రియో కపాడియో ఇక లేరు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన గురువారం మరణించారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. రియో.. షారుఖ్ మూవీ చక్ దే ఇండియాలో కామెంటేటర్ పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హ్యాపీ న్యూ ఇయర్, ఖుదాఫీజ్, దిల్ చహతాహై వంటి చిత్రాల్లో మెప్పించారు. ఆయన చివరి సారిగా మేడిన్ హెవెన్ సీజన్ 2లో మృణాల్ ఠాకూర్ తండ్రిగా కనిపించారు. ఆయన టీవీ ప్రేక్షకులకు బాగా సుపరిచితం. టీవీల్లో అనేక షోస్‌లో మెరిశారు. ఆయన స్కెచ్ ఆర్టిస్ట్ కూడా. ఆయన మరణ వార్తతో బాలీవుడ్ ఇండస్ట్రీ దు:ఖ సాగరంలో మునిగిపోయింది.  రియో కపాడియా అంత్యక్రియలు  శుక్రవారం ముంబయిలో జరగనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి