Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్లో చారిత్రక ఘట్టానికి సీఎం జగన్మోహన్ రెడ్డి నాంది పలికారు. సుమారు శతాబ్దం తర్వాత సమగ్ర భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. ఆది నుంచీ సంచలనాత్మక నిర్ణయాల ద్వారా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న జగన్.. ‘‘వైఎస్ఆర్ – జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష’’ పథకం ద్వారా చరిత్ర సృష్టించారు. బ్రిటీష్ కాలం నాటి లెక్కలను తవ్వి తీసి.. రాష్ట్రంలో భూ వివాదాలకు తావు లేకుండా సమగ్రమైన సర్వేకు శ్రీకారం చుట్టారు. భూ బకాసురుల రెక్కలు విరిచేలా.., కబ్జాదారుల ఆగడాలకు కళ్లెం వేసేలా కనీవినీ ఎరుగని కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్.. ఇకపై దొంగ రికార్డులు సృష్టించి భూములను కాజేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పథకం స్వరూపాన్ని చూస్తే భూకబ్జాదారులకు ఇక కాలం చెల్లినట్లేనని తెలుస్తోంది. జగన్ మాటల్లో కూడా అది స్పష్టమవుతోంది.
“ఇదొక యజ్ఞం. ఇలాంటి యజ్ఞం జరుగుతున్నప్పుడు రాక్షసులు దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. మనకు కూడా కొందరు దెయ్యాలు-రాక్షసులు ఉన్నారు. వాళ్లెవరో ప్రత్యేకంగా మీకు నేను చెప్పాల్సిన పనిలేదు. మన ఖర్మ కొద్దీ ఆ రాక్షసులకు ఎల్లో మీడియా తోడు కూడా ఉంది. వీళ్లంతా తప్పుడు ప్రచారాలు చేస్తారు.” అని భవిష్యత్ లో కలిగే అడ్డంకులను వివరిస్తూ వాటిని అధిగమించాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పారు. ఇదంతా పరిశీలిస్తే ఈ సర్వే ద్వారా ఏపీలో భూ వివాదాలను సమూలంగా మాయం చేయాలన్న బలమైన సంకల్పం కనిపిస్తోంది. కబ్జాలే కాకుండా.. అన్నదమ్ముల గొడవలు, కుటుంబ తగాదాలకు కూడా ఈ పథకం ద్వారా చెక్ పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు.. క్రయవిక్రయాలు కూడా ఇకపై సులభతరంగా మారనున్నాయి. భూమికి సంబంధించిన శాశ్వత పత్రం అందిన తర్వాత ఇకపై క్రయ-విక్రయాలన్నీ గ్రామ స్థాయిలోనే సెక్రటేరియట్ వేదికగా జరుగుతాయని, ఎవ్వరూ నాలుగైదు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదని జగన్ స్పష్టం చేశారు.
అత్యధిక మంది సిబ్బందిని, అత్యాధునిక టెక్నీలజీని వినియోగించడం ద్వారా పూర్తి రక్షణ వలయంలో, పకడ్బందీ ప్రణాళిక ద్వారా ఈ కార్యక్రమం పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 4, 500 సర్వే టీమ్ లు, 16,000 మంది సర్వేయర్లను ఇందుకోసం వినియోగిస్తోంది. ఒక్క పైస ప్రజల నుంచి వసూలు చేయకుండా.. ఇక సమగ్ర భూ సర్వే కోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను ప్రభుత్వమే భరించనుంది. 2023 జూన్ నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భూమి హక్కు సర్టిఫికెట్ పొందిన తర్వాత సదరు భూమిపై, హక్కు పొందిన యజమానికి హక్కు లేదని తేలితే, రాష్ట్ర ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుందని ప్రకటించి సంచలనానికి కేరాఫ్ గా నిలిచారు జగన్. అంగుళాలు, మిల్లీమీటర్లతో సహా భూమిని సర్వే చేయించి, ప్రభుత్వమే ఉచితంగా సర్వే రాళ్లు కూడా వేయిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సర్వే ఉద్దేశం, జరిగే తీరు.. అన్నీ అద్భుతమైన సత్కార్యానికి నాంది పలుకుతాయనడంలో సందేహం లేదు.