iDreamPost

క్రేజీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధం

క్రేజీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధం

మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కొశీయుమ్ తెలుగు రీమేక్ కు సంబంధించి తెరవెనుక పనులు వేగవంతం అయినట్టు సమాచారం. కొంత కాలం బాలకృష్ణ పేరు బలంగా వినిపించినప్పటికీ సినిమా చూశాక ఇది తన ఇమేజ్ కు నప్పదని డ్రాప్ అయినట్టు ప్రచారమయ్యింది. తాజా అప్ డేట్ ప్రకారం ఇప్పుడిది రవితేజ, రానాల కాంబోలో తెరకెక్కేలా ప్లానింగ్ జరుగుతోందట. అధికారికంగా చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ ఒకే అయ్యిందని ఫిల్మ్ నగర్ టాక్. క్రాక్ కు మిగిలిపోయున బాలన్స్ వర్క్ పూర్తి చేస్తే రవితేజ ఫ్రీ అయిపోతారు. ఆ తర్వాత 3 కమిట్మెంట్స్ ఉన్నాయి.

త్రినాథరావు, రమేష్ వర్మ, వక్కంతం వంశీ వీళ్ళు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఇంకా ఏదీ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. క్రమ సంఖ్య మారే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఇప్పుడు అయ్యప్పనుమ్ కొశీయుమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే రవితేజ ఫోకస్ అంతా క్రాక్ ఫీనిషింగ్ ఆ తరవాత ప్రమోషన్ మీద ఉంది. లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడిన పనులు ఇకపై జరగబోతున్నాయి. ఇక రానా విషయానికి వస్తే అరణ్య పూర్తి చేసి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. భారీ బడ్జెట్ విజువల్ వండర్ హిరణ్యకసిప గురించి ఆ మధ్య చెప్పారు కానీ ఎప్పుడు మొదలుపెడతారో దర్శకుడు గుణశేఖర్ నిర్మాత సురేష్ బాబు ఇద్దరూ స్పష్టత ఇవ్వలేదు. దీని సంగతలా ఉంచితే త్వరలో పెళ్లికొడుకు కాబోతున్న రానా ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదు.

ఇప్పుడీ ప్రపోజల్ ఒకే చేసినా షూటింగ్ కి పెద్ద టైం పట్టదు. ఇక్కడే తెలుగు రాష్ట్రాల్లోనే పూర్తి చేయొచ్చు. సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ హక్కులు సొంతం చేసుకున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ కి, డబ్బు మదంతో వీగే ఓ వాలంటరీ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ కి మధ్య ఈగో క్లాష్ ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని అయ్యప్పనుమ్ కొశీయుమ్ రూపొందింది. రవితేజ, రానాల కాంబినేషన్ కు తగ్గట్టు ఇది సరైన కథే. కాకపోతే హీరోయిన్లకు ఏ మాత్రం ప్రాధాన్యత లేని ఒరిజినల్ వర్షన్ ను తీసుకుని మనవాళ్ల టేస్ట్ కు, అభిమానుల అంచనాలకు తగ్గట్టు చాలా మార్పులే చేయాల్సి ఉంటుంది. మొత్తానికి గత కొద్దిరోజులుగా చప్పుడు లేకుండా ఉన్న ఈ క్రేజీ రీమేక్ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి