iDreamPost

నేడు, రేపు సిఎంలతో ప్రధాని మోడీ భేటీలు: కరోనాపై సుదీర్ఘ చర్చ

నేడు, రేపు సిఎంలతో ప్రధాని మోడీ భేటీలు: కరోనాపై సుదీర్ఘ చర్చ

దేశంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తరువాత కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఏం చేయాలన్న దానిపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకొని, తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నారు.

అందులో భాగంగానే ప్రధాని మోడీ మంగళవారం, బుధవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. మంగళవారం మధ్యాహ్నం 21 రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సిఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, సీనియర్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. బుధవారం మరో 15 రాష్ట్రాల సిఎంలు, అధికారులతో చర్చిస్తారు.

ప్రధాని మోడీ ఇప్పటి దాకా ముఖ్యమంత్రులతో ఐదు సార్లు సమావేశమయ్యారు. చివరిసారిగా మే 11న ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు. ఆ తరువాత మరికొన్ని లాక్ డౌన్ సడలింపులు ఇచ్చారు. జూన్ 1 లాక్ డౌన్ సడలింపులు ఎక్కువగా ఇచ్చారు. మెట్రో సర్వీసులు, అంతర్జాతీయ విమాన సర్వీసులు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, జిమ్ లు, రాజకీయ, మత, సాంస్కృతిక సభలు వంటి వాటికి మాత్రమే ప్రస్తుతం నిషేధం ఉంది.‌ మిగతా అన్ని పున:ప్రారంభమైయ్యాయి. దీంతో కరోనా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో తీసుకోవల్సిన అంశాలపై రాష్ట్రాలతో కేంద్ర చర్చలు జరుపుతుంది. అందులో భాగంగానే ప్రధాబి మోడీ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా రెండు రోజులు భేటీ అవుతున్నారు.

కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ గురించి ఆయన చర్చించనున్నారు. అయితే నేడు సమావేశం అయ్యే 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా ఆయన సంభాషించనున్నారు. దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో ఈ 21 రాష్ట్రాల్లో దాదాపు 5 శాతం యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో అత్యధిక కోవిడ్‌ కేసులు నమోదైన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. 

కరోనా వైరస్ కేసుల పెరుగుదల, రాష్ట్రాల భౌగోళిక స్థానాల ఆధారంగా రాష్ట్రాలను రెండు గ్రూపులుగా విభజించారు. ఈ జాబితాను ప్రధానమంత్రి కార్యాలయం ట్విటర్‌లో షేర్‌ చేసింది. మొదటి రోజు వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వతప్రాంత రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ రాష్ట్రాల్లో అత్యధిక కరోనా కేసులు అసోం(4049), పంజాబ్‌(3140), కేరళ(2461)లలో నమోదయ్యాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆదివారం నాటికి ఈ 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన మొత్తం క్రియాశీల కేసులు18,000 లోపు ఉన్నాయి. 7,500 మంది కోలుకోగా,  130కి పైగా మరణాలు సంభవించాయి. సోమవారం నాటికి దేశంలోని కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,32,424కి చేరగా, మృతుల సంఖ్య 9,520కి పెరిగింది.

ఇక రెండో రోజు ప్రధాని మోడీ సమావేశం కానున్న రాష్ట్రాల్లో దాదాపు 2.10 లక్షల కరోనా క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశం మొత్తం కేసుల్లోని దాదాపు 65 శాతం వీటిలోనే నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికులు స్వస్థలాలకు తిరిగి రావడం వల్లే కోవిడ్‌ కేసులు పెరిగినట్టు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చెబుతున్నాయి.

దేశంలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చలు జరపడం ఇది ఆరోసారి. మార్చి 20న తొలిసారిగా సిఎంలతో ఆయన మాట్లాడారు. ఈసారి కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలు తమ గళాన్ని గట్టిగానే వినిపించే అవకాశముంది. లాక్‌డౌన్‌ కారణంగా కుదేలయిన తమకు కేంద్రం ప్రత్యక్ష సాయం అందించాలని, షరతులు లేని రుణాలు అందించాలని ప్రధాని మోడీని కోరనున్నాయి.

కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎంలతో మాట్లాడిన తర్వాత ప్రధాని ఏం నిర్ణయం తీసుకుంటారోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి