iDreamPost

కాంగ్రెస్ ను వీడిన ముఖ్యనేత.. రాహుల్ పై సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ ను వీడిన ముఖ్యనేత.. రాహుల్ పై సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్‌లో జీ23 చిచ్చు రగులుతూనే ఉంది. పార్టీ పరిస్థితి గురించి తరచూ మాట్లాడుతున్న జీ23 నేతలు అధిష్టానాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తాజాగా కేరళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, జీ23లో ఒకరైన పీజే కురియన్‌ రాహుల్‌ గాంధీని, పార్టీ అధ్యక్ష పదవిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నెహ్రు కుటుంబీకులే ఉండాల్సిన అవసరంలేదని పీజే కురియన్ అన్నారు. కేరళలో ఆదివారం ఒక పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “రాహుల్ గాంధీ పార్టీలో సీనియర్లను సంప్రదించడం లేదు. పార్టీకి శాశ్వత అధ్యక్షుడు లేరు. దానికి కారణం రాహుల్ గాంధీ. ఆయన అధ్యక్షుడు కాలేడు, మరెవరినీ అంగీకరించడానికి కూడా సిద్ధంగా లేడు”అని కురియన్ కుండబద్దలు కొట్టారు.

కాంగ్రెస్‌లోని జీ-23 నాయకులలో ఒకరైన కురియన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అస్సాం పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ముఖ్యనాయకుడు రిపున్ బోరా ఆదివారం టీఎంసీలో చేరిన తరుణంలో ప్రస్తుతం పీజే కురియన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

“2019 లోక్‌సభ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ బాధ్యతల నుండి రాహుల్ పారిపోయారు. ఇప్పటికీ పార్టీలో నిబంధనలను నిర్దేశిస్తున్నాడు. ఇది అన్యాయం” అని కురియన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి శక్తివంతమైన అధ్యక్షుడు కావాలని కురియన్ స్పష్టం చేశారు. “ పార్టీ వరుస ఓటములను ఎదుర్కొంటున్నప్పుడు అధ్యక్ష పదవిని ఎక్కువ కాలం ఖాళీగా ఉంచలేం. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నప్పుడు పార్టీని నడిపించే ధైర్యం రాహుల్‌ చూపించి ఉండాల్సిందని కురియన్ అభిప్రాయపడ్డారు. కానీ రాహుల్ భాద్యతల నుంచి తప్పుకుని, అనుభవలేమితో తన చుట్టూ ఉన్న చిల్లర బ్యాచ్ తో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాడని కురియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓడ మునిగిపోతుందేమోనని భయపడి ఓడ దూకిన కెప్టెన్ అంటూ రాహుల్ నాయకత్వాన్ని కురియన్ ఎద్దేవా చేశారు. పార్టీకి సంబందించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సరైన చర్చలు జరగడం లేదని, ఇలాంటి పరిస్థితి పార్టీకి ప్రోత్సాహకరం కాదని కురియన్ అన్నారు. ప్రతిసారీ నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి మాత్రమే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలనే నిబంధన ఏమీ లేదన్నారు. “అలా నమ్మడంలో లాజిక్ లేదు. ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఉంటే, పార్టీని నడిపించడానికి వారిని అనుమతించాలి. నెహ్రూ కుటుంబానికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకూడదనే అజెండా జీ-23కి లేదు”అని కురియన్ పేర్కొన్నారు. సంస్థాగత ఎన్నికల ద్వారా రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడైతే తాము వ్యతిరేకించబోమని కురియన్ స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి