idream media
idream media
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం అప్రజాస్వామికం అంటూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలయ్యింది. జీవో నెంబర్ 617ని రద్దు చేయాలని కోరుతూ ఈ పిటీషన్ దాఖలయ్యింది. ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కదిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అదే సమయంలో పదవీకాం ముగిసిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగిస్తూ జీవో విడుదల అయ్యింది. దానికి కొనసాగింపుగా కొత్త ఎస్ఈసీగా కనకరాజుని నియమిస్తూ మరో జీవో వెలువడింది. కొత్త ఎస్ఈసీగా హుటాహుటీన కనక రాజు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో మర్యాదపూర్వకంగా ఆయన రాష్ట్ర గవర్నర్ ని కూడా కలిశారు.
ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ విపక్షాలు వాదించాయి. దానికి అనుగుణంగానే ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గౌతవరం గ్రామానికి చెందిన తాండవ యోగేష్ అనే న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రభుత్వ జీవోని అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. చట్టవిరుద్ధ జీవోని రద్దు చేయాలని కోర్టుని కోరారు. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంగా పిటీషన్ లో పేర్కొన్నారు. గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను పిటీషన్ లో ఉటంకించారు.
2007లో అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని, 2017లో ఏపీ హైకోర్టు తీర్పుని పిటీషన్ లో జతపరిచారు. వాటి ప్రకారం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ నిర్ణయం చెల్లుబాటుకాదని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , గ్రామీణాభివృద్ధి మరియు పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, న్యాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. దాంతో ఇప్పుడు న్యాయస్థానాలకు చేరిన ఈ వ్యవహారంలో కోర్టు ఎలా స్పందిస్తుందన్నది చర్చనీయాంశం అవుతోంది. ఈ పిల్ ని విచారణకు స్వీకరిస్తుందా అన్నది కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికే కొత్త కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో పరిణామాలు ఎటు దారితీస్తాయన్నది చూడాలి. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం చట్టపరంగా, న్యాయస్థానాల్లో ఎటువంటి అడ్డంకులు ఉండవని విశ్వసిస్తున్నారు. గతంలో ఉన్న తీర్పులను గుర్తు చేస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయసమ్మతం అని పేర్కొంటున్నారు.