iDreamPost

ఆంధ్రాలో కమలం గ్లాస్ కలయిక

ఆంధ్రాలో కమలం గ్లాస్ కలయిక

శనివారం మంగళగిరిలో జరిగిన జనసేన విస్తృతస్థాయి సమావేశంను అర్ధాంతరంగా ముగించి హడావుడిగా ఢిల్లీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు.బీజేపీ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు మేరకే జనసేనాని ఢిల్లీ వెళ్లారని పార్టీ వర్గాలు చెప్పినప్పటికీ నిన్నటి వరకు బిజెపి నాయకులు ఎవరు పవన్ కళ్యాణ్ ను కలవలేదు. అయితే ఆర్ఎస్ఎస్ ప్రముఖ నాయకులతో సమావేశమైనట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పార్టీ వర్గాల నుండి స్పష్టత రాలేదు. నేడు బిజెపి వర్కింగ్ అధ్యక్షుడు జేపీ నడ్డాను పవన్ కలవడంతో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి అమరావతి రాజధాని రైతుల సమస్యలను తీసుకు వెళ్తానని పదే పదే మీడియా ముందు హెచ్చరికలు చేసే పవన్ ఆయనను ఈ పర్యటనలో కలవలేదు. నేడు నడ్డా తో సమావేశమైన పవన్ కళ్యాణ్ రాజధాని అంశం కంటే రాజకీయ పొత్తులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు గుసగుసలు మీడియాలో వినిపిస్తున్నాయి.

Read Also: పొలిటిక‌ల్ గెస్ట్ రోల్ లో ప‌వ‌ర్ స్టార్..! జ‌నసేన‌కు గ‌డ్డుస్థితి త‌ప్ప‌దా?

గతంలో కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలను కలవడానికి ఢిల్లీ వెళ్లి రెండు రోజులు ఎదురు చూసినా బీజేపీ నేతల అపాయింట్మెంట్ లభించలేదు. అయినా పవన్ కళ్యాణ్ మరోసారి బీజేపీ నేతలను కలవడానికి ప్రయత్నించడం పట్ల రాజకీయ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పర్యటనలో కూడా బీజేపీ ముఖ్యనేతలు అపాయింట్మెంట్ లభించక పోవడంతో జేపీ నడ్డాను మాత్రమే కలుసుకోగలిగారు.

జేపీ నడ్డా ను కలిసిన తర్వాత జనసేనాని ఆంధ్రప్రదేశ్ కు తిరుగు పయనమయ్యారు. బీజేపీతో పొత్తు కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ఇప్పటికే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన పవన్ కళ్యాణ్ సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న స్థానిక సంస్థలు ఎన్నికలలో బీజేపీతో కలిసి పోటీ చేస్తారా? కాలమే సమాధానం చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి