iDreamPost

ఈఎస్ఐ కుంభకోణంలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల పాత్ర – ఎవరిని వదలం అంటున్న ఏసీబీ

ఈఎస్ఐ కుంభకోణంలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల పాత్ర – ఎవరిని వదలం అంటున్న ఏసీబీ

మాజీ మంత్రి, అసెంబ్లీలో టిడిపి ఉపనేత కె.అచ్చెన్నాయుడి లేఖ ఆధారంగానే టెలీ హెల్త్‌కు కాంట్రాక్ట్‌లు ఇచ్చారని, ఈఎస్‌ఐలో రూ.150 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) తెలిపింది. ఈ మేరకు ఎసిబి జాయింట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.

అవసరం లేకపోయినా మందులు, నాణ్యత లేని పరికరాలు కొనుగోలు చేశారని ఆయన అన్నారు. అప్పట్లో కార్మిక శాఖ మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు ఇచ్చిన లేఖల ద్వారా ఆర్డర్లు ఇవ్వాలని, ఈఎస్‌ఐ అధికారులను ఆదేశించినట్టు నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు.

ఆధారాలు ఉన్నాయి కాబట్టే అచ్చెన్నాయుడిని విచారణకు రావాలని కోరలేదని పేర్కొన్నారు. తగిన ఆధారాలు సేకరించి, అవకతవకలు జరిగినట్టు గుర్తించిన తరువాతనే ఆయనను అరెస్ట్‌ చేశామని తెలిపారు. రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు.

ఈఎస్‌ఐలో 2014 నుంచి 2019 వరకు రూ 988.77 కోట్లతో మందులు, పరికరాల కొనుగోలు చేశారు. ఇందులో రూ.150 కోట్లకు పైగా అవినీతి అక్రమాలు జరిగినట్టు గుర్తించామని చెప్పారు. ల్యాబ్‌ కిట్లు, సర్జికల్‌ మెటీరియల్, ఆఫీస్‌ ఫర్నిచర్, ఈసీజీ పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగినట్టు గుర్తించామని పేర్కొన్నారు.

ఈ కుంభకోణంలో అప్పటి కార్మిక శాఖ మంత్రి, టెక్కలి ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుతోపాటు మొత్తం 19 మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించామని, ఇప్పటివ రకు ఏడుగుర్ని అరెస్ట్‌ చేశామని చెప్పుకొచ్చారు. టెలీ మెడిసిన్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఏడుగురిపై రెండు కేసులు నమోదు చేశామన్నారు.

ఒక కేసు టెలీ హెల్త్‌ సర్వీసులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టడంపై, మరో కేసు మందులు, పరికరాల కొనుగోళ్లలో అక్రమాలపై నమోదు చేశామని వివరించారు. ఒక కేసులో చింతల కృష్ణప్ప రమేష్‌కుమార్‌ ఏ–1 గాను, అచ్చెన్నాయుడు ఏ–2 గాను ఉన్నారు. మరో కేసులో ఈటగాడి విజయకుమార్, విప్పర్తి జనార్దన్, ఇవన రమేష్‌బాబు, ఎంకెపి చక్రవర్తి, గోరో వెంకట సుబ్బారావు నిందితులుగా ఉన్నారు. వీరందరికీ ఎసిబి కోర్టు న్యాయమూర్తి రిమాండ్‌ విధించడంతో రాజమహేంద్రవరంలోని కేంద్ర కారాగారానికి తరలించామని‌ చెప్పుకొచ్చారు.

అచ్చెన్నాయుడి ఆరోగ్య సమస్య ఉండటంతో మెరుగైన వైద్యం అందించాలని సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని, శస్త్ర చికిత్స చేయించుకున్న విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లడంతో రిమాండ్‌ అనంతరం ఆస్పత్రికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.

ఈ కుంభకోణానికి సంబంధించి అనేక మందిని విచారణ చేయాల్సి ఉందని, అనేక రికార్డులు, డాక్యుమెంట్లు పరిశీలించాల్సి ఉందని చెప్పారు. అచ్చెన్నాయుడు, రమేష్‌ కుమార్‌ తరపున హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్లు వేశారని, హైకోర్టు నుంచి నోటీసులు వచ్చిన అనంతరం వాటిని పరిశీలించి ఎసిబి సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు.

ఈ కుంభకోణానికి తెలంగాణాలోను లింకులున్నాయని, ఇందులో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. ఈ కుంభకోణం వెనుక ఇంకా చాలా మంది ఉన్నారని, ప్రభుత్వ అధికారులతో పాటు ప్రైవేట్‌ వ్యక్తుల ప్రమేయం ఎక్కువ ఉందని, అవినీతి వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరినీ బయటకు లాగుతామని వివరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి