iDreamPost

పేదోడి దగ్గరకొచ్చేసరికే ఈ దుగ్ధ ఎందుకో..?

పేదోడి దగ్గరకొచ్చేసరికే ఈ దుగ్ధ ఎందుకో..?

‘‘ఈ రాష్ట్రంలో ప్రజలు రేషన్‌ కూడా తెచ్చుకోలేనంత బిజీ అయిపోయారా.. వ్యాన్లు పెట్టి మరీ పంపిణీ చేస్తామంటున్నారు..’’ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఓ కామెంట్‌ ఇది.

రేషన్‌ పంపిణీకి మినీ వ్యాన్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ సీయం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించినప్పుడు దీని గురించి పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదనే చెప్పాలి. తీరా అన్ని పథకాల్లాగే ఈ పథకం కూడా అమలులో కొచ్చేసేసరికి ప్రతిపక్షాలు తమ మైకులకు పనిచెబుతున్నాయి. వారి సోషల్‌ మీడియా వింగులు కూడా ఎక్కడలేని ప్రాసను, కవిత్వాన్ని ఎరువుతెచ్చుకుని మరీ సెటైర్లు వేసేందుకు సిద్ధపడిపోతున్నాయి. వేలాది వాహనాలు అలా రోడ్ల వెంబడి మండల కేంద్రాలకు చేరిపోవడం చూసే సరికి వాళ్ళకు మైండ్‌బ్లాక్‌ అయ్యిందన్న సంకేతాలు వారివారి కామెంట్ల రూపంలో ఇప్పటికే సోషల్‌ మీడియా వ్యూవర్స్‌కు అవగతమైపోయిందనే చెప్పాలి. దీంతో బుర్ర తిరిగి పైన చెప్పుకున్న కామెంట్ల చేసుకుంటూ సంతృప్తి పడుతున్నారు.

కూలికెలితే గానీ రోజు గడవని కుటుంబాలు ఈ రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్నాయి. వారంతా రేషన్‌ తెచ్చుకోవాలంటే పని మానుకుని రేషన్‌ షాపు వద్దే తమ వంతు వచ్చేవరకు వేచి చూడాలి. అంటే రేషన్‌ తెచ్చుకోవాలి అంటే కూలిని వదిలేసుకోవాలి. ఇటువంటి పరిస్థితులు చూసి, మినీ ట్రక్కుల ద్వారా ఇంటి వద్దకే సరుకులు అందించాలన్న పథకానికి రూపకల్పన చేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏదైనా ఒక పథకం అమలు చేస్తే నేరుగా లబ్దిదారుడికి మాత్రమే దాని ఫలితం ఉంటుంది. కానీ మినీ ట్రక్కుల ఏర్పాటు ద్వారా లబ్దిదారులతో పాటు, ట్రక్కులు పొందిన యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఇంత ప్రయోజనం ఉంది కాబట్టే ప్రతి ‘పక్షులు’ తమ మైకులతో బురదజల్లడం విస్తృతం చేసేస్తున్నారు.

అవకాశం దొరికినప్పుడల్లా బట్ట కాల్చి మీదేసే ప్రయత్నాలు చేస్తున్న వీళ్ళంతా గత ఇరవై నెలల కాలంలో దాదాపు పదమూడున్నర లక్షలకు పైగా ఉద్యోగాలను కూడా సీయం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కల్పించారన్న విషయాన్ని ఎందుకు ఒప్పుకోరన్న ప్రశ్నకు సమాధానం దొరకదు.

సచివాలయ సిబ్బంది, వార్డు/గ్రామ వాలంటీర్లు, అంబులెన్స్‌ సిబ్బంది, సరుకుల సరఫరా వాహనాల సిబ్బంది.. ఇలా వీరంతా.. కొత్తగా ఉద్యోగులు వచ్చిన వాళ్ళే ప్రతి నెలా రూ. 10 వేల నుంచి రూ. 15వేలకు మధ్య జీతాలు తీసుకుంటున్నవారే. మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు ఉత్తనే ఇచ్చేస్తున్నారని కూడా కామెంటు చేస్తారా ప్రతిపక్ష పార్టీల నేతలు… అంటే చేసే సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే ఇలా విమర్శలు చేస్తున్న పార్టీ కార్యకర్తల, నేతల కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఏదో ఒక ఉద్యోగాన్ని గానీ, ఉపాధిని గానీ తప్పకుండా పొందే ఉంటారు కాబట్టి.

పేద వాడికి పెట్టేటప్పుడు కామెంట్లు చేస్తూ.. దుగ్దను ప్రదర్శిస్తూ ఆనందం పొందే బదులు, రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్న జగన్‌కు విలువైన సూచనలు, సలహాలు ఇస్తే మంచిదేమో ప్రతిపక్ష పార్టీలు ఆలోచిస్తే మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి