idream media
idream media
కొంతమంది నలభైలు, యాభైలు దాటినా పదవ తరగతి పరీక్షలు రాయడం చూస్తూనే ఉన్నాం. వారు చదువుకోవాల్సిన టైంలో డబ్బులు లేకో కుటుంబ సమస్యల వల్లో, మరో కారణంవల్లో చదువుకోలేదు. ఇప్పుడు ఆసక్తితో పరీక్షలు రాస్తున్నారు. ఓ ఎమ్మెల్యే పదవ తరగతి పరీక్షలు రాయడం వైరల్ గా మారింది.
ఒడిశాలో పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. మే 10వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల్లో అధికార పార్టీకి చెందిన ఒడిశా పుల్బానీ(Odisha’s Phulbani) నియోజకవర్గ బీజేడీ ఎమ్మెల్యే అంగద కన్హార్ (Angada Kanhar) ఎగ్జామ్ రాయడానికి హాజరయ్యారు. రుజంగీ హైస్కూల్ సెంటర్కు వెళ్లి ఆయన ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ పరీక్ష రాశారు. ఆయనతో పాటు అతని ఇద్దరు పాత స్నేహితులు కూడా పరీక్ష రాయడం విశేషం.
ఎమ్మెల్యే అయిన తర్వాత పదో తరగతి ఎందుకు? 1978లో పదో తరగతికి వెళ్ళాను. కానీ కుటుంబ సమస్యలతో చివరి పరీక్షలకు హాజరు కాలేకపోయాను. అయితే వయసు పైబడిన వాళ్ళు చాలామంది పరీక్షలకు హాజరవుతుండడం చూసి నేను కూడా నా పదవ తరగతిని పూర్తిచేయాలని అనుకుని చదివి పరీక్షలు రాస్తున్నాను అని ఎమ్మెల్యే అంటున్నారు. 60 ఏళ్ళ వయసులో ఎమ్మెల్యే అయి ఉండి కూడా పదవ తరగతి పరీక్షలు రాస్తుండటంతో అందరూ ఆయన్ని అభినందిస్తున్నారు.