iDreamPost

చైనా కంపెనీలకు షాకిచ్చిన నితీశ్ కుమార్..

చైనా కంపెనీలకు షాకిచ్చిన నితీశ్ కుమార్..

జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో భారత సైనికులకు చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో తెలుగు తేజం కల్నల్ సంతోష్ బాబుతో పాటు 21 మంది భారత సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో చైనా కంపెనీలను బహిష్కరించాలన్న వాదన ఊపందుకుంది. బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్ అన్న నినాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చైనా కంపెనీలకు షాకిచ్చారు.

వివరాల్లోకి వెళితే చైనా సైనికులు చేసిన దాడిలో బీహార్ సైనికులు ఐదుగురు మృతిచెందారు. దీంతో బీహార్ లో చైనాపై ఆగ్రహావేశాలు ఎక్కువయ్యాయి. తాజాగా పాట్నాలో నిర్మించనున్న మహాత్మాగాంధీ వంతెనకు గతంలో ఇచ్చిన టెండర్‌ను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రద్దు చేశారు. దీనికి కారణం వంతెన నిర్మాణానికి టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లకు చైనా కంపెనీలతో భాగస్వామ్యం ఉండటమే. కాంట్రాక్టర్లకు చైనా కంపెనీల భాగస్వామ్యం మార్చుకోవాలని చెప్పినా వారు నిరాకరించారని దాంతో టెండర్‌నే రద్దు చేసినట్లు బీహార్ మంత్రి నంద్ కిశోర్ యాదవ్ తెలిపారు.

దీంతో సదరు కాంట్రాక్టర్లతో పాటు చైనా కంపెనీలకు నితీశ్ కుమార్ ప్రభుత్వం షాక్ ఇచ్చినట్లయింది. మహారాష్ట్ర ఇప్పటికే చైనా కంపెనీలతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి