iDreamPost

కెజిఎఫ్ దారిలో నితిన్ ‘పవర్’

కెజిఎఫ్ దారిలో నితిన్ ‘పవర్’

తన కొత్త సినిమా రంగ్ దే కీలక దశలో షూటింగ్ ఉండగా కరోనా వల్ల బ్రేక్ వేసుకున్న నితిన్ ఆ తర్వాత చేయబోయే సినిమాలు కూడా ఫుల్ క్లారిటీతో లైన్ లో పెట్టేసుకున్నాడు. రంగ్ దే తర్వాత మేర్లపాక గాంధీతో అందాదున్ రీమేక్ తో పాటు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఇంకో ప్రాజెక్ట్ ఫైనల్ చేసిన నితిన్ ఆ తర్వాత కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ‘పవర్ పేట’ అనే భారీ చిత్రం ఒకటి చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చాలా నెలల నుంచి సాగుతోంది. ఇదే కాంబోలో మొన్న ఏడాది చల్ మోహనరంగా వచ్చింది కానీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

మొదటి సినిమా రౌడీ ఫెలోతో కృష్ణ చైతన్యకు మంచి పేరు వచ్చింది. అందుకే మూడో సినిమాను పకడ్బందీగా రూపొందించే లక్ష్యంతో పక్కా ప్లానింగ్ తో ఉన్నారట. అయితే దీనికి సంబంధించి మరో కీలక అప్ డేట్ బయటికి వచ్చింది. దాని ప్రకారం పవర్ పేట రెండు భాగాలుగా తీయబోతున్నారట. అంటే ఫస్ట్ పార్ట్ రిలీజయ్యాక సీక్వెల్ వస్తుందన్న మాట. అంత పెద్ద కథా అంటే సబ్జెక్ట్ డిమాండ్ చేసిందని సమాచారం. ఏలూరు ప్రాంతంలో పుట్టి పెరిగి పెద్ద స్థాయికి ఎదిగిన ఓ మాఫియా గ్యాంగ్ స్టర్ కథతో ఇది రూపొందుతుందట.

ఇలాంటి లైన్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి కాని పవర్ పేటని చాలా డిఫరెంట్ గా స్పెషల్ గా ప్లాన్ చేయబోతున్నట్టు వినికిడి.తమిళ్ లో ధనుష్ కి వడ చెన్నై ఎంత పేరు తెచ్చిందో అదే తరహలో నితిన్ కి పవర్ పేట ఒక మెమరబుల్ మూవీగా నిలిచిపోయేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. వచ్చే ఏడాది రెండో సగంలో కాని పవర్ పేట షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ లేదు. ఈలోగా క్యాస్టింగ్ తో పాటు టెక్నికల్ టీం ని సెట్ చేసుకునే పనిలో ఉన్నారు కృష్ణ చైతన్య. అసలే టాలీవుడ్ కు సీక్వెల్ సెంటిమెంట్ అచ్చిరాలేదు. ఒక్క బాహుబలి తప్ప 2 నెంబర్ పెట్టుకుని వచ్చిన ఏ సినిమా ఆడలేదు. మరి పవర్ పేటలో అంత మ్యాటర్ ఏముందో ఇంత కాన్ఫిడెన్స్ తో రెండు భాగాలు అంటున్నారు. వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి