iDreamPost

నిర్మల్‌: ప్రేమోన్మాది ఘాతుకం.. వెలుగులోకి సంచనల నిజాలు

  • Published Feb 09, 2024 | 10:20 AMUpdated Feb 09, 2024 | 10:20 AM

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో గురువారం ప్రేమోన్మాది ఓ యువతిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో గురువారం ప్రేమోన్మాది ఓ యువతిని దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..

  • Published Feb 09, 2024 | 10:20 AMUpdated Feb 09, 2024 | 10:20 AM
నిర్మల్‌: ప్రేమోన్మాది ఘాతుకం.. వెలుగులోకి సంచనల నిజాలు

నేటి కాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. ప్రేమించిన వారు తమకు మాత్రమే దక్కాలి.. లేదంటే వారు చనిపోవాలి.. వాళ్ల జీవితం నాశనం కావాలనుకునే రాక్షస ప్రేమికులు సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రేమించేంత వరకు వెంటపడే వారు.. ఎదుటి వ్యక్తి తమ లవ్‌ని అంగీకరించకపోతే.. ఇక వారిలో ఉన్న రాక్షసులు బయటకు వస్తారు. అప్పటి వరకు ప్రాణంగా ప్రేమిస్తున్నాము అన్న వారు.. తమ ప్రపోజల్‌ని అంగీకరించపోతే.. ప్రాణాలు తీయడానికి కూడా వెనకడాటం లేదు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. నడిరోడ్డుపై యువతిని నరికి చంపాడు ఓ ప్రేమోన్మాది. ఆ వివరాలు..

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ పట్టణంలో గురువారం దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తనకు దక్కని యువతి ఎవరికీ దక్కకూడదనుకున్న ఉద్దేశంతో.. ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. పట్టపగలే ఆమెపై కత్తితో దాడిచేసి కడతేర్చాడు. అడ్డువచ్చిన యువతి వదినపైనా కూడా దాడి చేసి గాయపర్చాడు. నిర్మల్‌ డీఎస్పీ గంగారెడ్డి కథనం ప్రకారం.. ఖానాపూర్‌ పట్టణ పరిధి అంబేడ్కర్‌నగర్‌ కాలనీకి చెందిన జూకింది శ్రీకాంత్‌(28) అనే యువకుడు ఓ ఆన్‌లైన్‌ సంస్థలో డెలివరీబాయ్‌గా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతడికి అదే కాలనీలో ఉంటున్న గంగారాం-గంగవ్వల చిన్నకుమార్తె చెటుపల్లి అలేఖ్య(22)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్ల తర్వాత.. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న అలేఖ్య కుటుంబ సభ్యులు ఆమెను మందలించారు. అంతేకాక మూడు నెలల క్రితం వేరే వ్యక్తితో అలేఖ్యకు పెళ్లి నిశ్చయించారు..

పెళ్లి చెడగొట్టి..

అలేఖ్యకు మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది అన్న విషయం తెలుసుకున్న శ్రీకాంత్‌ ఎలాగైనా దాన్ని చెడగొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అలేఖ్య వివాహం చేసుకోబోతున్న యువకుడి ఇంటికి వెళ్లి.. వారికి తమ ప్రేమ వ్యవహారం గురించి చెప్పాడు. దాంతో పెళ్లి ఆగిపోయింది. ఈక్రమంలో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో వారు ఇరు కుటుంబాల సభ్యులు, పెద్దల సమక్షంలో శ్రీకాంత్‌కు అనేకసార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా అతనిలో మార్పు రాకపోగా..అలేఖ్యపై పగ పెంచుకున్నాడు. అప్పట్నుంచి ఆమెని వేధిస్తూ వస్తున్నాడు.

ఈ క్రమంలో గురువారం అలేఖ్య.. తన వదిన జయశ్రీతో కలిసి టైలరింగ్‌ ట్రైనింగ్‌కు వెళ్లినట్టు తెలుసుకున్న శ్రీకాంత్‌.. ఆమెని హతమార్చేందుకు ప్లాన్‌ చేసుకున్నాడు. దానిలో భాగంగా గురువారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో అంబేడ్కర్‌నగర్‌ కాలనీకి వెళ్లే చౌరస్తాలో కాపుకాశాడు శ్రీకాంత్‌. ఆ తర్వాత ఆ మార్గంలో ఇంటికి వెళ్తున్న అలేఖ్య, ఆమె వదినను అనుసరించాడు. జన సంచారం లేని ప్రాంతంలోకి రాగానే తన వెంట తెచ్చుకున్న కొబ్బరి బోండాలు నరికే కత్తితో వారిపై దాడి చేశాడు.

శ్రీకాంత్‌ చేస్తున్న దారుణానికి గ్రహించిన అలేఖ్య, ఆమె వదిన.. అతడి బారి నుంచి తప్పించుకుని పారిపోతుండగా.. వారిని వెంబడించాడు. తొలుత అలేఖ్యను దొరకపట్టి ఆమె మెడపై నరికాడు. పక్కనే ఉన్న జయశ్రీ చంపొద్దంటూ అతడి కాళ్లు పట్టుకుని బతిమిలాడినా కనికరం చూపకపోగా..ఆమె తలపై, కాళ్లపై కత్తితో నరుకుతూ పక్కకు నెట్టేశాడు. ఈ పెనుగులాటలో జయశ్రీ రెండేళ్ల కుమారుడు రియాన్స్‌ తలకు కత్తి గాయాలయ్యాయి. అనంతరం అలేఖ్యను పలుమార్లు కత్తితో నరికాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు శ్రీకాంత్‌.

ఇక తీవ్రంగా గాయపడిన జయశ్రీ, ఆమె కుమారుడిని కుటుంబ సభ్యులు ఖానాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆతర్వాత మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేశామని.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ ఘటనపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క డీఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి