iDreamPost
android-app
ios-app

సొంత పార్టీ దిశగా సచిన్ అడుగులు..?

సొంత పార్టీ దిశగా సచిన్ అడుగులు..?

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరుకుంది. సచిన్ పైలట్ తో పాటు 20 మంది ఎమ్మెల్యేలకు అనర్హత వేటు నోటీసులు ఇవ్వడంతో కథ మరో మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో సచిన్ తన వర్గం ఎమ్మెల్యేలతో బిజెపిలో‌ చేరుతారని చర్చ జరిగింది. అయితే దానికి సచిన్ పైలట్ పుల్ స్టాప్ పెట్టారు. తండ్రి అకాల మరణంతో లౌకిక వాదిగా రాజకీయాలు చేసుందుకు ముందుకు వచ్చారు.

ఆయన భార్య కూడా ముస్లిం. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కుమార్తె. అంతటి లౌకిక భావాలు గల సచిన్ బిజెపిలో చేరటం లేదని స్పష్టం చేశారు. అయితే మరోవైపు కాంగ్రెస్ తో సచిన్ ప్రయాణం కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఒకపక్క కాంగ్రెస్ అగ్రనేతలు సచిన్ తో జరుపుతున్న చర్చలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉన్నాయని, సచిన్ పైలట్ రావచ్చని ఆ పార్టీ ప్రకటించింది. మరోవైపు బిజెపి సచిన్ వర్గాన్ని తనవైపు తెప్పించుకునేందుకు సిద్ధపడింది.

ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. అటు కాంగ్రెస్ వైపు కాకుండా, ఇటు బిజెపి వైపు కాకుండా కొత్త పార్టీ పెట్టేందుకు సచిన్ సమాయత్తం అవుతున్నాడా…? అంటే జరుగుతున్న పరిణామాయ అందుకు అనుకూలంగా ఉన్నాయి. అయితే సచిన్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బిజెపి పాలిత హర్యానాలో ఒక రిసార్ట్ లో ఉన్నారు. భవిష్యత్తు రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు.

ఈ సందర్భంగా సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడుతూ తాను బిజెపిలో చేరే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పదవుల నుంచి తొలగించిన తరువాత తొలిసారిగా మీడియాతో ఆయన మాట్లాడారు. బిజెపిలో చేరననీ, ఆ పార్టీ ఓటమికి కష్టపడి పని చేశానని చెప్పారు. ”కొంత మంది కాంగ్రెస్‌ నేతలు నేను బిజెపిలోకి చేరతాననే ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్నారు. బిజెపిని ఓడించడానికి నేను చాలా సమయం కేటాయించి, ప్రయత్నాలు చేశాను” అని సచిన్‌ తెలిపారు. బిజెపిలో చేరడం నిజం కాదన్నారు.

స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూపు (ఎస్‌ఒజి) నుంచి నోటీసులు పంపడం, గత ఏడాదన్నరగా ఎదుర్కొన్న అవమానాలు తనను ప్రధానంగా మనోవేదనకు గురిచేశాయన్నారు. అవి ఇంకా పరిష్కరించలేదని తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో సంప్రదింపుల్లోనే ఉన్నాననీ, ఈ చర్చలు ఎలాంటి తీర్మానాలకు దారితీయ లేదని చెప్పారు.

పార్టీకి వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. ”అశోక్‌ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా నా నిజమైన మనోవేదనలతో నేను ఇక్కడ ఉన్నాను” అని చెప్పారు. పైలట్‌ సొంత పార్టీ ఏర్పాటు దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాల్సిన మీడియా సమావేశాన్ని పైలట్‌ రద్దు చేశారు. కాంగ్రెస్ తో జరుగుతున్న చర్చలు బెడిసికొడితే..సొంత పార్టీ పెట్టే యోచనలో సచిన్ ఉన్నట్లు సమాచారం.