iDreamPost

మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. మీ జేబుకు చిల్లు పడే ఛాన్స్‌

  • Published Feb 28, 2024 | 2:55 PMUpdated Feb 28, 2024 | 2:55 PM

కొత్త నెల ప్రారంభం కాబోతుంది అంటే కొత్త రూల్స్‌, కొన్నింటి ధరల్లో మార్పులు జరుగుతాయి. అలానే మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి రాబోతున్నాయి. ఆ వివరాలు..

కొత్త నెల ప్రారంభం కాబోతుంది అంటే కొత్త రూల్స్‌, కొన్నింటి ధరల్లో మార్పులు జరుగుతాయి. అలానే మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి రాబోతున్నాయి. ఆ వివరాలు..

  • Published Feb 28, 2024 | 2:55 PMUpdated Feb 28, 2024 | 2:55 PM
మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. మీ జేబుకు చిల్లు పడే ఛాన్స్‌

సాధారణంగా నెల ప్రారంభం అవుతుంది అంటే.. కొన్ని రంగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిల్లో ముఖ్యమైనవి బ్యాంక్‌లు. అలానే ఆయిల్‌ కంపెనీలు కూడా నెల ప్రారంభం అయ్యిందంటే చాలు గ్యాస్‌ సిలిండర్‌ ధరలకు సంబంధించి మార్పులు చేర్పులు చేస్తాయి. మరో రెండో రోజుల్లో ఈ నెల ముగియనుంది. ఇక మార్చి 1, 2024 నుంచి కొన్ని ముఖ్యమైన నియమాలు అమల్లోకి రాబోతున్నాయి. వాటి వల్ల సామాన్యులపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది అంటున్నారు ఎకానమీ నిపుణులు. అంతేకాక ఈ ఆర్థిక సంవత్సరం.. మార్చి నెలతో ముగుస్తుంది. అందుకే ఈ నెల చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇక ఫిబ్రవరిలో చాలా నియమాలు మారాయి. ఇక మార్చిలో కూడా కొన్ని కొత్త రూల్స్‌ అమల్లోకి రాబోతున్నాయి. వాటిల్లో.. గ్యాస్ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డులు, జీఎస్‌టీ రూల్స్ వంటివి ఉన్నాయి. ఆ వివరాలు ఓసారి తెలుసుకుందాం.

చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన ఎల్‌పీజీ గ్యాస్ (డొమెస్టిక్‌, కమర్షియల్‌ సిలిండర్) సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. దానిలో భాగంగా ఈ ఫిబ్రవరి 1వ తేదీన కమెర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచాయి చమురు సంస్థలు. కానీ గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. అయితే మార్చిలో డొమెస్టిక్ సిలిండర్ ధరలను సైతం పెంచే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే సామాన్యులపై మరింత భారం పడనుంది.

ఇక మార్చి 1వ తేదీ నుంచి జీఎస్‌టీకి సంబంధించిన కొత్త నియమాలు అమల్లోకి వస్తున్నాయి. దానిలో భాగంగా మార్చి నుంచి వ్యాపారులు కచ్చితంగా ఇ-ఇన్వాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది. రూ. 5 కోట్లు ఆపైన టర్నోవర్ ఉండి, ఒక రాష్ట్ర నుంచి మరో రాష్ట్రానికి ఎగుమతి, దిగుమతులు చేసే వ్యాపారులు ఇ-వే బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికి కూడా కొందరు వ్యాపారులు ఇ-ఇన్వాయిస్ లేకుండానే ఇ-వే బిల్లులు జారీ చేస్తున్నట్లు గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. దానికి చెక్‌ పెట్టడం కోసం మార్చి 1 నుంచి కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ఇ-ఇన్వాయిస్ ఇస్తేనే ఇ-వే బిల్లు జారీ అయ్యేలా మార్పులు చేసింది. జీఎస్‌టీ రూల్స్ ప్రకారం రూ.50 వేల పైన వస్తువుల విక్రయాలు జరిపినప్పుడు ఇ-బిల్స్ ఇవ్వాలి. మార్చి 1 నుంచి ఇ-ఇన్వాయిస్ లేకుండా ఇ-బిల్స్ ఇవ్వడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది.

బ్యాంకింగ్‌ రంగం విషయానికి వస్తే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త రూల్స్ తీసుకొస్తోంది. క్రెడిట్ కార్డుల మినిమమ్ డే బిల్ కాలిక్యులేషన్ ప్రాసెస్‌లో అనేక మార్పులు చేసినట్లు తెలిపింది. ఈ కొత్త రూల్స్ మార్చి 15వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ఎస్‌బీఐ ఇటీవలే ప్రకటించింది.

మార్చి 15 నుంచి పేటీఎంపై ఆంక్షలు..

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. మార్చి 15నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.. జనవరి 31, 2024 రోజున ఆర్‌బీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై బ్యాంకింగ్ సేవలు నిర్వహించకూడదు, కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, డిపాజిట్ల సేకరణ, వాలెట్ లోడింగ్ వంటి ఏ కార్యకలాపాలను నిర్వహించొద్దని ఆర్‌బీఐ ఆదేశించింది. ఆ ఆంక్షలను మార్చి 15 వరకు వాయిదా వేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి