iDreamPost

తప్పిపోయింది చెప్పి.. దొరికిన వాళ్ల గురించి ఎందుకు చెప్పడం లేదు? అసలు లెక్కలు!

తప్పిపోయింది చెప్పి.. దొరికిన వాళ్ల గురించి ఎందుకు చెప్పడం లేదు? అసలు లెక్కలు!

ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా వాలంటీర్లు మీద దుష్ప్రాచారం జరగడం చూస్తూనే ఉన్నాం. వాళ్లు డేటా తీసుకెళ్లి ఎవరెవరికో ఇస్తున్నారని.. ఆ డేటా సాయంతోనే మహిళలు, అక్కచెల్లెళ్లు, చిన్నారుల అపహరణ జరుగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మహిళల మిస్సింగ్ కేసులకు సంబంధించి రాజ్యసభలో 2019, 2020, 2021 సంవత్సరాలకు సంబంధించి డేటాను విడుదల చేశారు. అందులో ఏపీకి సంబంధించి 30,196 మంది మహిళలు చిన్నారులు తప్పిపోయినట్లు లెక్కలు చూపించారు. వారిలో 7,918 మంది 18 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఈ మొత్తం లెక్కలను తన ట్విట్టర్ ఖాతాలో పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.

ఆ లెక్కలను చూపిస్తూ ఎప్పటిలాగానే ప్రభుత్వం మీద బురద జల్లేందుకు శ్రీకారం చుట్టారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంక ముందు వెనకా చూసుకోకుండా కొందరు పనికట్టుకుని నెట్టింట నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా ఈ లెక్కలకి సమాధానం చెప్పాలి అంటూ.. ఏపీ హోంమంత్రి, డీజీపీని డిమాండ్ కూడా చేశారు. ఇదంతా చాలా బాగుంది. రాష్ట్ర ప్రజల పట్ల, తెలుగు అక్క చెల్లెళ్ల పట్ల పవన్ కల్యాణ్ కు ఉన్న అభిమానాన్ని, బాధ్యతను ప్రశంసిద్దాం. అయితే ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ కు నెట్టింట కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మిస్ అయిన వాళ్ల లెక్కలు చెప్పావు బాగానే ఉంది.. దొరికిన వాళ్ల లెక్కలు ఎందుకు చెప్పడం లేదు?

అంటే ఈ మూడేళ్లలో ఏపీ పోలీసులు ఎవరినీ కనుక్కోలేకపోయారా? 2019 తర్వాత జరిగిన మిస్సింగ్ కేసుల గురించి చెబుతున్నావ్.. 2016- 2017- 2018 సంవత్సరాల మహిళల అపహరణ, మిస్సింగ్ కేసుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఎప్పుడో 2019కి ముందు తప్పి పోయిన వాళ్లు నీకు అక్కా చెల్లెళ్లు కారా? వారి బాధ్యత మీరు తీసుకోవడం లేదా? ఈ ప్రశ్నలకు జనసేనాని సమాధానం చెప్పేందుకు సమయం ఉంటుందో లేదో అని.. వైఎస్సార్ సీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో అసలు లెక్కలు పోస్ట్ చేశారు. ఆ లెక్కలు చూసిన తర్వాత గాని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పవన్ ఎంతలా కష్టపడుతున్నారో అర్థంకాదు.

AP పోలీసు శాఖ కృషి:

కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం పిల్లలు- మహిళలు కలిపి మూడేళ్లలో మొత్తం 30,196 మంది తప్పిపోయారు. ఈ మిస్సింగ్ కేసుల విషయంలో ఏపీ పోలీసు శాఖ చేసిన కృషి, వారు పడిన కష్టం గురించి మాత్రం ప్రస్తావించడానికి కానిస్టేబుల్ కొడుకు అయిన పవన్ కల్యాణ్ కు నోరు రావడం లేదు. మిస్సింగ్ కేసుల విషయంలో ఏపీ పోలీసులు నూటికి నూరు శాతం ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఏ ఒక్క కేసును వాళ్లు తేలిగ్గా తీసుకోవడం లేదు. పవన్ కల్యాణ్ చేస్తున్న అర్థంలేని విమర్శలు అన్నీ.. ఏపీ పోలీసుల కృషిని తక్కువ చేయడమే అవుతుంది. తప్పిన పోయిన 30,196 మంది మహిళలు, చిన్న పిల్లల్లో 23,394 మందిని తిరిగి వారి కుటుంబాలతో కలిపారు. ఈ లెక్కలను పవన్ కల్యాణ్ ఎందుకు చెప్పడం లేదంటూ ఒక్క వైసీపీ శ్రేణులే కాదు.. నెటిజన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు.

2016-2018 లెక్కలు:

వినిపిస్తున్న మరో ప్రశ్న.. 2019- 2021 లెక్కలు బాగా వల్లిస్తున్న పవన్ కల్యాణ్ ఎందుకు 2019కి ముందు లెక్కల గురించి మాట్లాడటం లేదు? రాష్ట్రంలో 2019కి ముందు అసలు మహిళలు మిస్ అవ్వలేదా? చిన్నారులు రాష్ట్రంలో తప్పిపోయినట్లు కేసులు నమోదు కాలేదా? ఎందుకు కాలేదు అందుకు సంబంధించిన లెక్కలను కూడా పవన్ కల్యాణ్ చెప్పిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోనే వెల్లడించింది. 2016 నుంచి 2018 మధ్య మొత్తం 22,266 మంది మహిళలు, చిన్నారులు మిస్ అయ్యారు.

2016 సంవత్సరంలో మహిళలు 4,454, 2017లో 5,225, 2018లో 5,792 మంది మహిళలు మిస్ అయినట్లు కేసులు నమోదు అయ్యాయి. చిన్నారులు 2016వ సంవత్సరంలో 2,155 మంది, 2017లో 2204 మంది చిన్నారులు, 2018లో 2,436 మంది చిన్నారులు మిస్ అయినట్లు కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 22,266 మంది తప్పిపోతే.. వారిలో 6,795 మంది చిన్నారులే ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఏంటంటే.. ఎందుకు పవన్ కల్యాణ్ ఈ లెక్కల గురించి మాట్లాడటం లేదు? అసలు చంద్రబాబు హయాంలో తప్పిపోయిన మహిళలు పవన్ కల్యాణ్ కు అక్కచెల్లెళ్లు కారా? అని ప్రశ్నిస్తున్నారు. పవన్ తీరు చూస్తేనే చంద్రబాబుని కాపాడుతూ.. ప్రభుత్వంపై బురద చల్లేందుకు కంకణం కట్టుకున్నారనే విషయం అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.

వాలంటీర్లు లేని రాష్ట్రాల పరిస్థితి?:

పవన్ కల్యాణ్ విమర్శలు చూస్తే.. వాలంటీర్ల వల్లే రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు, చిన్నారులు మిస్ అయ్యారు. అయితే కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కంటే ముందు చాలానే రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఎక్కడా వాలంటీర్లు లేరు. పవన్ చెప్పిన ప్రకారం అక్కడి వారి డేటాను ఎవరు లీక్ చేస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో వాలంటీర్లు రాక ముందు తప్పిపోయిన వాళ్ల డేటాను ఎవరు లీక్ చేశారు? ఈ ప్రశ్నలకు పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలంటూ వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవాలను దాచేసి.. అసత్యాలను ప్రచారం చేయడం మానుకోవాలని సూచిస్తున్నారు. వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన లెక్కలను చూసి ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా.. పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి