iDreamPost

లక్షా అరవై వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

లక్షా అరవై వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

ఒక్కరోజులో 6566 పాజిటివ్ కేసుల నిర్దారణ

దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం 6 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోడవుతున్న విషయం తెలిసిందే. గడచిన 24 గంటల్లో మరోసారి సుమారు ఆరువేల ఐదు వందల పాజిటివ్ కేసులుగా నిర్దారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజులో 6566 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,58,333 కు చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకు 4531 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 194 మంది మరణించారు. కరోనా వైరస్ బారినుండి 67,692మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 86,110 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో 2190 పాజిటివ్ కేసులు నిర్దారణ

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు.గత కొద్దిరోజులుగా రోజుకు రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 2190 పాజిటివ్ కేసులు నమోదవడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతుంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 56,948 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 1897 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 34,018 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. 1097 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో నిన్న కొత్తగా 107 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 2098 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 714 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 1321 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 63 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 134 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 3117 కి మందికి కరోనా సోకగా 58 మంది మృత్యువాత పడ్డారు.2065 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 994 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 5,790,103 మందికి కోవిడ్ 19 సోకగా 357,432 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 2,497,618 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,745,803 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 102,107 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి