iDreamPost

Drugs: రూ.2వేల కోట్ల డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసు.. సినీ నిర్మాత అరెస్ట్‌

  • Published Mar 09, 2024 | 2:53 PMUpdated Mar 09, 2024 | 2:53 PM

Jaffer Sadiq: సుమారు 2 వేల రూపాయల డ్రగ్స్‌ కేసులో ప్రముఖ కోలీవుడ్‌ నిర్మాత, డీఎంకే నేతను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు..

Jaffer Sadiq: సుమారు 2 వేల రూపాయల డ్రగ్స్‌ కేసులో ప్రముఖ కోలీవుడ్‌ నిర్మాత, డీఎంకే నేతను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు..

  • Published Mar 09, 2024 | 2:53 PMUpdated Mar 09, 2024 | 2:53 PM
Drugs: రూ.2వేల కోట్ల డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసు.. సినీ నిర్మాత అరెస్ట్‌

ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో డ్రగ్స్‌ సమస్య ప్రధానమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాదకద్రవ్యాల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. డ్రగ్స్‌ కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటున్నా.. పూర్తి స్థాయిలో మాత్రం నిర్మూలించలేకపోతుంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌ రెడ్డి.. ప్రాంరభంలోనే డ్రగ్స్‌ నిర్మూలనపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్‌ వినియోగం, రవాణా కేసుల్లో ఎవరు పాలు పంచుకున్నా సరే.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలకు జారీ చేశారు.

ఇక టాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగం గతంలో ఎంతటి కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా రాడిసన్‌ హోటల్‌లో మరో సారి డ్రగ్స్‌ వినియోగం వెలుగులోకి రావడం.. దీనిలో టాలీవుడ్‌ దర్శకుడు క్రిష్‌ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో తాజాగా 2 వేల కోట్ల రూపాయల డ్రగ్స్‌ కేసులో బడా నిర్మాత, రాజకీయ నాయకుడు ఒకరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు..

డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ తమిళ సినీ నిర్మాత, డీఎంకే మాజీ సభ్యుడు జాఫర్‌ సాదిక్‌ను శనివారం నాడు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. గత నాలుగు నెలలుగా పరారీలో ఉన్న అతడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నట్లు ఎన్సీబీ శనివారం వెల్లడించింది. భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ మధ్య డ్రగ్స్‌ అక్రమ రవాణా నెట్‌వర్క్‌కు ఇతడే ‘మాస్టర్‌మైండ్‌, సూత్రధారి’ అని ఎన్సీబీ అధికారులు పేర్కొన్నారు.  ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలకు సుమారు రూ.2వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను సాదిక్‌ ఆధ్వర్యంలో అక్రమంగా రవాణా చేసినట్లు వెల్లడించారు.

కొన్ని రోజుల క్రితం తమిళనాడులో భారీ ఎత్తున మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మదురైలో కొందరు రైల్వే ప్రయాణికుల వద్ద, చెన్నైలోని ఓ డంప్‌ యార్డ్‌లో సుమారు రూ.180 కోట్ల విలువైన డ్రగ్స్‌ను గుర్తించారు అధికారులు. వీటిని తమిళనాడు నుంచి శ్రీలంకకు అక్రమ రవాణా చేసేందుకు యత్నిస్తుండగా అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆతర్వాత దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈక్రమంలోనే ఈ అంతర్జాతీయ డ్రగ్స్‌ దందా బయటపడింది. అయితే ఈ మొత్తం స్మగ్లింగ్‌ వెనుక జాఫర్‌ సాదిక్‌ ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈక్రమంలో పోలీసులు జాఫర్‌ సాదిక్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాక కొన్ని రోజుల క్రితం తమిళనాడులోని అతడి నివాసాలు, ఆఫీసుల్లో ఎన్సీబీ అధికారులు సోదాలు జరిపారు. ఇక గత నాలగు నెలలుగా పరారీలో ఉన్న జాఫర్‌ సాదిక్‌ను శనివారం నాడు అరెస్ట్‌ చేశారు. ఇక కోలివుడ్‌లో నాలుగు సినిమాలను నిర్మించిన జాఫర్‌ సాదిక్‌.. రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్నాడు. డీఎంకే ఎన్‌ఆర్‌ఐ విభాగానికి ఆఫీస్‌ బేరర్‌గా పనిచేశాడు. అయితే, డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో డీఎంకే అతడిని పార్టీ నుంచి బహిష్కరించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి