iDreamPost

దర్బార్ స్టైల్ లో బాలయ్య సినిమా ?

దర్బార్ స్టైల్ లో బాలయ్య సినిమా ?

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్ పెద్దగా ఆడలేదు కాని అందులో తలైవా స్టైలింగ్ కి అభిమానులు బాగా ఖుషీ అయ్యారు. తెలుగులోనే ఓ మాదిరిగా ఆడింది కాని తమిళ్ లో మాత్రం డిజాస్టర్ అయిపోయి కొన్నవాళ్ళకు భారీ నష్టాలు మిగిల్చింది. ఫలితం సంగతి ఎలా ఉన్నా దర్బార్ లో తండ్రికూతుళ్ళుగా నటించిన రజిని-నివేదా థామస్ ల బాండింగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో దర్శకుడు మురుగదాస్ దాన్ని అర్ధంతరంగా ముగించాడు కాని చివరిదాకా ఉంటే ఇంకో లెవెల్ లో ఉండేదని ప్రేక్షకులు అభి ప్రాయపడ్డారు.

దీనికి బాలయ్యకు కనెక్షన్ ఏమిటని ఆశ్చర్యపడకండి. విషయం ఉంది. ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలకృష్ణ దాని తర్వాత బి గోపాల్ కు కమిటయ్యరని గత నెల రోజులుగా గట్టి ప్రచారమే జరుగుతోంది. అధికారిక ప్రకటన రాలేదు కాని ప్రాజెక్ట్ ఓకే అయినట్టు చెబుతున్నారు. ఇందులో కథ కూడా తండ్రి కూతుళ్ళ మధ్య అనుబంధం ఆధారంగా సాగుతుందని వినికిడి. రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న తండ్రి, వయసుకొచ్చి స్వంతంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యమున్న కూతురు మధ్య సెంటిమెంట్ తో పాటు కావలసినంత యాక్షన్ డ్రామా కూడా వచ్చేలా బి గోపాల్ పవర్ ఫుల్ సబ్జెక్టు రెడీ చేయించారట.

ఒకరకంగా చెప్పాలంటే 1992లో రిలీజైన రౌడీ ఇన్స్ పెక్టర్ కు ఇప్పుడు ఫ్యామిలీ ఉంటే ఎలా ఉంటాడనే ఆలోచనతో ఇది రాసుకున్నట్టు సమాచారం. దానికి సీక్వెల్ అని కూడా అనొచ్చట. కాకపోతే సోలోగా హీరో బేస్డ్ స్టొరీని నడిపించకుండా ఇలా డాటర్ ఎమోషనల్ బ్లాక్ ని అటాచ్ చేసినట్టు టాక్. మొత్తానికి బాలయ్య వరస పరాజయాల తర్వాత కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల డిజాస్టర్, రూలర్ పరాజయం తర్వాత నందమూరి స్టార్ మార్కెట్ బాగా డ్యామేజ్ అయ్యింది. ఇది రికవర్ కావాలంటే సాలిడ్ బ్లాక్ బస్టర్ చాలా అవసరం. అందుకే బోయపాటి, బి గోపాల్ సినిమాల మీదే అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి