iDreamPost

పవన్ డేట్ తీసుకున్న నాని – ఇదీ కారణం

పవన్ డేట్ తీసుకున్న నాని – ఇదీ కారణం

ఇవాళ న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా దసరా రిలీజ్ డేట్ ప్రకటించారు. 2023 మార్చ్ 30న థియేటర్లలో విడుదల చేస్తామని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అయితే ఇదే తేదీకి పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు వస్తుందని కొద్దిరోజుల క్రితమే నిర్మాత ఏఎం రత్నం తనను ఓ ఈవెంట్ లో కలిసిన మెగా ఫ్యాన్స్ తో అన్నారు. కాకపోతే అధికారకంగా టీమ్ నుంచి పోస్టర్ లాంటిది రాలేదు. ఈలోగా అలెర్ట్ అయిపోయిన దసరా టీమ్ తెలివిగా ఆ తేదీని బ్లాక్ చేసుకుంది. అయితే ఇది కావాలని జరిగిందా లేక అనుకోకుండా అలా ప్లాన్ చేసుకున్నారాని పవర్ స్టార్ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. దీని వెనుక పలు ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

ఏఎంరత్నం మార్చి 30 అన్నారన్న మాటే కానీ నిజానికి హరిహర వీరమల్లు ఖచ్చితంగా ఎప్పుడు పూర్తవుతుందో ఆయనా చెప్పలేక పోతున్నారు. ఒకపక్క జనసేన పనుల్లో పవన్ బాగా బిజీ అయ్యారు. మరోవైపు వినోదయ సితం రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గెటప్ కోసం మళ్ళీ జుత్తుని పెంచి వీరమల్లుకి రెడీ కావడం అంత సులభం కాదు. ఇది తెలిసే దసరా బృందం మార్చి 30 తీసుకుంది. ఒకవేళ పవన్ అదే తేదీకి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తే అప్పుడు దసరాని వాయిదా వేయడమో లేదా ఇంకాస్త ముందుకు జరపడమో చేయొచ్చు. ఇంకా ఆరు నెలలకు పైగా టైం ఉంది కాబట్టి సేఫ్టీ కోసం అనౌన్స్ చేయడం తప్ప కట్టుబడాలన్న గ్యారెంటీ లేదు.

దసరా నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియడ్ డ్రామాలో హీరో పాత్ర సిల్క్ స్మిత అభిమాని. అదే పాయింట్ ని పోస్టర్ లో హైలైట్ చేశారు. 1980 నేపథ్యంలో బొగ్గుగనుల బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయబోతున్నారు. నేను లోకల్ తర్వాత కీర్తి సురేష్ నానితో జంట కట్టింది. నానికి ఇది హిట్ కావడం చాలా అవసరం. వి, టక్ జగదీశ్ లు ఓటిటి రిలీజ్ లోనూ ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయాయి. శ్యామ్ సింగ రాయ్ సక్సెసే కానీ దానికి ఎక్స్ పెక్ట్ చేసిన రేంజ్ దక్కలేదు. అంటే సుందరానికి నష్టాలు మిగిల్చింది. సో దసరాతో అభిమానులు కోరుకుంటున్న బలమైన కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి