Dharani
Dharani
కళ్లు మూస్తే మరణం.. కళ్లు తెరిస్తే జననం అన్నాడో సినీ కవి. మృత్యువు అనేది ఎప్పుడు ఎవరిని ఎలా.. తనతో తీసుకుపోతుందో అంచాన వేయడం కష్టం. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఆరోగ్యంగా ఉన్న వారు కూడా ఉన్నట్లుండి మృత్యువాత పడుతున్న ఘటనలు అనేకం చూశాం. ఇక ఈ మధ్య కాలంలో ఇలాంటి ఆకస్మిక మరణాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. వీరంతా గుండెపోటు కారణంగానే మృతి చెందుతుండటం తీవ్ర కలకలం రేపుతుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న వారు.. ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపే కన్నుమూస్తున్నారు. రెండు రోజుల క్రితం ఇంటర్ విద్యార్థిని ఒకరు ఫ్రెషర్స్ పార్టీలో డ్యాన్స్ చేస్తూ.. కుప్ప కూలి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది. ఆ వివరాలు..
స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న యువకుడు ఉన్నట్లుండి కుప్ప కూలాడు. ఈ విషాదకర ఘటన నంద్యాల జిల్లా బేతంచెర్లలో చోటు చేసుకుంది. పట్టణంలోని సంజీవనగర్ కాలనీకి చెందిన మహేంద్ర అనే యువకుడు ఆదివారం మధ్యాహ్నం.. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ అకస్మాత్తుగా కుప్ప కూలాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే మహేంద్ర గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.