iDreamPost

ఆగిపోయిన నాగ్ సినిమా రీస్టార్ట్ ?

ఆగిపోయిన నాగ్ సినిమా రీస్టార్ట్ ?

కొన్ని సినిమాలు ప్రారంభోత్సవం చేసుకుంటాయి కానీ సెట్స్ పైకి వెళ్ళేలోగా ఆగిపోయేవి ఎన్నో. అందులోనూ స్టార్లు ఉన్నవి అయితే మళ్ళీ రీ స్టార్ట్ కావడం కోసం అభిమానులు ఎదురు చూస్తుంటారు. అలాంటిదే ఇది కూడా. 2018లో ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో నాన్ రుద్రన్(నేను రుద్రుడిని)టైటిల్ తో ఓ మూవీని మొదలుపెట్టారు. గ్రాండ్ ఓపెనింగ్ చేసి మీడియాను కూడా పిలిచారు. పా పాండి తర్వాత ధనుష్ డైరెక్షన్ మూవీ కావడంతో ముందే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇది రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లకుండానే ఆగిపోయింది.

ఇందులో మరో విశేషం ఏంటంటే కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రకు ఒప్పుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఇది జరిగి రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మొదలుపెట్టేందుకు ధనుష్ రెడీ అవుతున్నాడు. లాక్ డౌన్ కాగానే ఆ పనుల్లో బిజీగా మారిపోతాడు . ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తాన్ని మరోసారి టీం తో కలిసి రీ చెక్ చేసుకుని ఫైనల్ వెర్షన్ ఓకే చేశాడట. మరి ముందు అనుకున్న ప్రకారం నాగార్జున ఇందులో కంటిన్యూ అవుతారా లేదా చూడాలి. ఆదితి రావు హైదరి హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో స్పైడర్ విలన్ ఎస్ జే సూర్య, శ్రీకాంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీన్ రొల్డన్ సంగీతం అందిస్తున్నారు.

మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉంటూనే మెసేజ్ మిక్స్ అయ్యేలా ధనుష్ దీని కథను చాలా ప్రత్యేకంగా రాసుకున్నాడట. పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించిన జగమే తంతిరం విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత ప్రాజెక్ట్ నాన్ రుద్రన్ అని చెన్నై మీడియా టాక్. ఒకవేళ నాగార్జున మళ్ళీ జాయిన్ అయితే దీనికి తెలుగు వెర్షన్ పరంగానూ మంచి క్రేజ్ వస్తుంది. నాగ్ ఇలా స్పెషల్ క్యామియోలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కృష్ణార్జున, అధిపతి, నిన్నే ప్రేమిస్తా తదితర చిత్రాల్లో చేశారు. హిందీలోనూ కొన్ని మూవీస్ ఉన్నాయి. ఇప్పుడీ ధనుష్ ప్రాజెక్ట్ కూడా అదే కోవలోకి రాబోతోంది. పూర్తి వివరాలు లాక్ డౌన్ అయ్యాక తెలిసే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి