iDreamPost

పవన్ 27లో మ్యూజిక్ షాక్ ?

పవన్ 27లో మ్యూజిక్ షాక్ ?

కరోనా లాక్ డౌన్ ప్రభావమో లేక ఇంకే కారణమో చెప్పలేం కానీ మొత్తానికి ఈ మూడు నెలల కాలం టాలీవుడ్ ని విపరీతమైన పరిణామాలకు గురి చేస్తోంది. స్క్రిప్ట్ లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విదేశీ షెడ్యూల్స్ కి బదులు ఇక్కడే ఫిలిం సిటీలోనో లేక స్టూడియోలోనో బాలన్స్ షూటింగులను పూర్తి చేసుకునేలా పలువురు ప్లానింగ్ లో ఉన్నారు. ఇప్పుడు దీని ప్రభావం పవన్ 27 మీద కూడా పడినట్టు ఉంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో కేవలం 2 పాటలే ఉంటాయని ఫ్రెష్ అప్ డేట్. ఇది అఫీషియల్ గా వచ్చిన న్యూస్ కాకపోయినా ఫిలిం నగర్ టాక్ అయితే జోరుగా ఉంది.

కీరవాణి స్వరపరిచిన ఈ పాటల రికార్డింగ్ కూడా పూర్తయ్యిందని తెలిసింది. అయితే ఇది కరోనా ప్రభావం వల్ల చోటు చేసుకున్న మార్పా లేక ముందే అలా అనుకున్నారా అనే క్లారిటీ లేదు. బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం భారీ సెట్లు కూడా వేశారు. నిర్మాత ఏఎం రత్నం రాజీ పడకుండా ఖర్చు పెడుతున్నారు. అవుట్ స్కర్ట్స్ లో వేసిన సెట్ ప్రమాదానికి గురైందనే న్యూస్ వచ్చింది కానీ దాని గురించి యూనిట్ సైలెంట్ గా ఉంది. అయితే కథ మేరకే పాటలు ఎక్కువ వద్దని హీరో దర్శకుడు నిర్ణయించుకున్నారని మరో వెర్షన్ వినిపిస్తోంది. అభిమానుల కోసమైనా పెట్టాల్సి ఉన్నా స్క్రిప్ట్ ఆ మేరకు డిమాండ్ చేయడం లేదట. అంతకు మించిన కిక్ ఇచ్చేలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలిసింది. ముఖ్యంగా కోహినూర్ వజ్రం దొంగతనం చేసే ట్రాక్ పవన్ సినిమాల్లో ఎప్పుడూ చూడని రేంజ్ లో ఉంటుందని సమాచారం.

జాక్వలిన్ ఫెర్నాండేజ్, అర్జున్ రామ్ పాల్, జయరాం తదితరులు నటిస్తున్న ఈ మూవీలో ఇంకో హీరోయిన్ ని ఫైనల్ చేయాల్సి ఉందన్నారు కానీ అదీ అవసరం ఉండకపోవచ్చని తెలిసింది. ఇక్కడ ఇంకో విశేషం ఉంది. వకీల్ సాబ్ లోనూ ఎక్కువ పాటలు ఉండవట. నాలుగు తెరమీద ఐదు ఆడియోలో ఉంటాయి కానీ అవీ కథకు అనుగుణంగా తప్ప కమర్షియల్ కోణంలో ఉండవని చెబుతున్నారు. సో ఏదో ఖుషి, అత్తారింటికి దారేది రేంజ్ లో ఊహించుకోకుండా అభిమానులు అంచనాలు తక్కువగా ఉంచుకుంటే మంచిది. వకీల్ సాబ్ ఎలాగూ లేట్ అవుతోంది కాబట్టి పవన్-క్రిష్ కాంబినేషన్ సినిమా వచ్చే ఏడాది చివరిదాకా విడుదలయ్యే ఛాన్స్ లేనట్టే. దీనికి విరూపాక్ష అనే టైటిల్ ముందు నుంచి ప్రచారంలో ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి