iDreamPost

పోలింగ్‌ ముగిసింది.. ఫలితంపైనే ఆసక్తి..

పోలింగ్‌ ముగిసింది.. ఫలితంపైనే ఆసక్తి..

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఐదు గంటల కల్లా క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో పలు చోట్ల ఇంకా పోలింగ్‌ జరుగుతోంది.

మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 53.57 శాతం మేర పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా తూర్పుగోదావరిలో 66.25 శాతం, అత్యల్పంగా విశాఖ జిల్లాలో 47.63 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ గణాంకాల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్‌ పోలింగ్‌ 60 శాతం మేర ఉంటుందనే అంచనాలున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం పోలింగ్‌ నమోదైంది.

కొన్ని చోట్ట చెదురుమదురు ఘటనలు మినహా మున్సిపల్‌ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. తిరుపతి కార్పొరేషన్‌లో ఒక డివిజన్‌లో పోలింగ్‌ ఆగిపోయింది. ఒక ఓటరుకు రెండు బ్యాలెట్లు ఇస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించడంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు. ఈ నెల 13వ తేదీన ఆగిపోయిన చోట రీ పోలింగ్‌ జరగనుంది.

Also Read : చెప్పకపోయినా ఓటేస్తారు.. కానీ ఓటేసేందుకు ఏం వెంటబెట్టుకెళ్లాలో చెప్పాలి కదా నిమ్మగడ్డ గారు..?

విశాఖలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో స్టీల్‌ ప్లాంట్‌ ప్రభావం కనిపించింది. ఎన్నికల సమయంలోనూ కార్మికులు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిపారు. బ్యాలెట్‌తోపాటు సేవ్‌ స్టీల్‌ ప్లాంట్‌ పేరుతో పంపిణీ చేసిన ఓటరు స్లిప్పులను కూడా బ్యాలెట్‌ బ్యాక్సుల్లో వేయాలని జేఏసీ నేతలు ఓటర్లను అభ్యర్థించారు. స్టీల్‌ ప్లాంట్‌కు మద్ధతుగా పలువురు ఓటర్లు బ్యాలెట్‌తోపాటు స్లిప్పులు కూడా బ్యాలెట్‌ బ్యాక్సుల్లో వేశారు. గమనించిన పోలింగ్‌ సిబ్బంది ఇలా వేయకూడదని చెప్పారు. బ్యాలెట్‌తోపాటు స్లిప్పు కూడా వేస్తే ఆ ఓటు చెల్లదని స్పష్టం చేశారు.

12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలటీలు, నగర పంచాయతీలకు పోలింగ్‌ జరిగింది. పులివెందులు, పిడుగురాళ్ల, పలమనేరు, మాచర్ల మున్సిపాలిటీల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also Read : మున్సిపల్‌ ఎన్నికలు : జోరుగా పోలింగ్‌.. మంత్రి ఓటు గల్లంతు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి