iDreamPost

రిటైర్మెంట్ కోసం మల్టీస్టారర్ స్కెచ్

రిటైర్మెంట్ కోసం మల్టీస్టారర్ స్కెచ్

దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి ప్రస్థానం గురించి చెప్పాలంటే ఓ వెయ్యి పేజీల పుస్తకం కన్నా ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. మాస్ సినిమాను ఓ కొత్త మలుపు తిప్పి హీరోయిజంను ఇంకో లెవల్ కు తీసుకెళ్లిన కమర్షియల్ డైరెక్టర్ గా ఆయన ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన అడవి రాముడు, ఘరానా మొగుడు, వేటగాడు లాంటివి దానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అన్నమయ్య లాంటి భక్తి రస చిత్రంతోనూ రికార్డులు సృష్టించడం ఆయనకే చెల్లింది. ఈయన ఆఖరిగా డైరెక్ట్ చేసిన చిత్రం ఓం నమో వెంకటేశాయ.

ఎన్నో అంచనాలతో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. 2017లో విడుదలైన ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన దర్శకత్వం జోలికి వెళ్ళలేదు. దీని కన్నా ముందు వచ్చిన షిరిడి సాయి, ఝుమ్మంది నాదం, పాండురంగడులది కూడా సేమ్ రిజల్ట్. ఇన్ సైడ్ టాక్ ప్రకారం రాఘవేంద్రగారు త్వరలో రిటైర్ అయ్యే ఆలోచనలో ఉన్నారట.అయితే ఇలా ఫ్లాప్ రికార్డుతో కాకుండా ఒక బ్లాక్ బస్టర్ తో వీడ్కోలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట . దానికి గాను ఒక మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నారట. దీని కోసం చిరంజీవితో పాటు నాగార్జున, వెంకటేష్ లు కూడా ఉండేలా ఓ క్రేజీ స్టొరీ సిద్ధం చేయించే పనిలో ఉన్నట్టు వినికిడి.

ఇదీ నిజమో కాదో కాని వినడానికి అయితే ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ ముగ్గురు హీరోలకు రాఘవేంద్రరావుతో పర్సనల్ గా చాలా బాండింగ్ ఉంది. వెంకటేష్ మొదటి డెబ్యు కలియుగ పాండవులు తీసింది రాఘవేంద్రరావే. ఇక చిరు, నాగ్ లకు ఇచ్చిన ఎవర్ గ్రీన్ మూవీస్ గురించి చెప్పేదేముంది. ఎటొచ్చి బాలయ్య మల్టీ స్టారర్స్ కి దూరంగా ఉంటారు కాబట్టి ఆయన పేరు ఇందులో లేదేమో కాని మొత్తానికి దర్శకేంద్రుల స్కెచ్ మాత్రం భారీగా ఉంది. ఒకవేళ కార్యరూపం దాలిస్తే మూవీ లవర్స్ కు అంత కన్నా కావాల్సింది ఏముంటుంది. అసలే ఇది ఎప్పటి నుంచో కలలుగంటున్న డ్రీం కాంబినేషన్. చూద్దాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి