iDreamPost

ఖాకీ డ్రెస్ వేసి బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ పారిశుధ్య సేవలో వైసీపీ ఎమ్మెల్యే

ఖాకీ డ్రెస్ వేసి బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ పారిశుధ్య సేవలో వైసీపీ ఎమ్మెల్యే

ఆపత్కాలంలో ప్రజాప్రతినిధులు తమలోని సామాజిక సేవా గుణాన్ని బయట పెడుతున్నారు. తమకు తోచిన సామాజిక సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వైసీపీ సీనియర్ నేత తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికుడిగా మారారు. తెల్ల చొక్కా వదిలి ఖాకీ చొక్కా తొడిగి రోడ్లమీదకు వచ్చారు. రోడ్లను, పబ్లిక్ ప్లేస్ లో శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లారు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు పరిశుభ్రత ఎంతో అవసరం అని చెబుతున్న నిపుణుల మాటలను భూమన కరుణాకర్ రెడ్డి ఆచరణలో చూపుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

విద్యార్థి జీవితం నుంచే భూమన కరుణాకర్ రెడ్డి సమాజ సేవ చేస్తున్నారు. విద్యార్థి రాజకీయాల్లో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. సమాజ సేవ చేయాలన్న తపన నే భూమన కరుణాకర్ రెడ్డి ని ప్రత్యక్ష రాజకీయాల వైపు కి మళ్లించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా, ఎమ్మెల్యేగా ఆయన తిరుపతి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా భూమన ప్రజలతో మమేకమై తిరుపతి నగర అభివృద్ధి కి పని చేస్తున్నారు.

తిరుపతిలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి చొరవ ఎనలేనిది. శ్రీవారి దర్శనానికి దేశవిదేశాల నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యగా తిరుమలలో స్వామివారి దర్శనాన్ని విడతల వారిగా నిలిపివేశారు. పిల్లలు, వృద్దులు స్వామి దర్శనానికి రావద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ దూరప్రాంతాల నుంచి రావాలనుకున్న వారిని నిలువరించారు. లాక్ డౌన్ కి ముందే తిరుమలలో భక్తుల రాక పై నిషేధం విధించారు. దాని ఫలితమే ఈరోజు తిరుపతిలో కరోనా వైరస్ కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గురువారం నాటికీ 20 కేసులు మాత్రమే నమోదయ్యాయంటే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డిల ముందు చూపే కారణమని నిస్సందేహంగా చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి