iDreamPost

మా కథలు అప్పుడే అయిపోలేదు

మా కథలు అప్పుడే అయిపోలేదు

ప్రచారం సందర్భంగా ఎవరెన్ని మాటలు అనుకున్నా తిట్టుకున్నా మొత్తానికి మా ఎన్నికలు పూర్తయ్యాయి. మంచు విష్ణు గెలిచాడు. ప్రకాష్ రాజ్ ఓటమిని స్వీకరించలేక తన కారణాలు చెప్పేసి రాజీనామా పంపాడు. నాగబాబు ఆల్రెడీ ఆ పని చేశాడు. ఇక్కడితో కథ అయిపోలేదు. వెబ్ సిరీస్ తరహాలో ఇకపై కూడా ఇది కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. ముఖ్యంగా చిరంజీవి తనను విత్ డ్రా చేసుకోమని అడిగిన వ్యవహారాన్ని బయట పెట్టడం పట్ల మెగా ఫ్యాన్స్ ట్విట్టర్ లో గట్టిగానే ఫైర్ అవుతున్నారు.

అంతర్గత విషయాలను ఇలా బయటపెడతారా అంటూ నిలదీస్తున్నారు. ఏ ఎలక్షన్ అయినా సర్దుబాట్లు సహజం కాబట్టి చిరు అలా అడిగి ఉండొచ్చు. కానీ చెప్పేయొచ్చా అనేదే పాయింట్. ఇక ప్రకాష్ రాజ్ సైతం త్వరలో అసలు కారణాలు చెబుతానని, తనను సపోర్ట్ చేసినవాళ్లను నిరాశ పరచను అనే రీతిలో ట్వీట్లు పెట్టడం మరో చర్చకు దారి తీస్తోంది. మొన్నటి సాయంత్రం దాకా దాదాపు విన్నర్ అయిపోయిందనే స్థాయిలో ప్రచారం జరిగిన యాంకర్ అనసూయ మరుసటి రోజు ఓటమి ప్రకటన తర్వాత గట్టిగానే కౌంటర్లు వేసింది. మరోవైపు శివాజీరాజా గత అధ్యక్షుడు నరేష్ చేసిన అవకతవకల మీద విచారణ చేయాలని కొత్త పాయింట్ ఎత్తుకున్నారు.

అది కూడా 15 రోజుల్లోపే అని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అలా జరగకపోతే న్యాయ పోరాటానికైనా సిద్ధమని చెప్పడం మరో కొత్త ట్విస్ట్. ఈయన నిజంగా అంత పని చేస్తే మాత్రం విష్ణుకు ఇబ్బందే. ఎందుకంటే తన గెలుపులో నాన్న మోహన్ బాబు కంటే నరేష్ ఎక్కువ కష్టపడ్డారని మైక్ ముందే చెప్పేశారు కాబట్టి. మొత్తానికి రాబోయే రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇది స్పష్టంగా కనిపిస్తోంది. మా బిల్డింగ్ వ్యవహారం, మ్యానిఫెస్టోలో చెప్పినవన్నీ చేసి చూపించడం విష్ణు మీద పెద్ద బరువే ఉంది. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ప్రత్యర్ధులు కాచుకుని ఉంటారు కాబట్టి రెండేళ్ల ప్రయాణం ఛాలెంజింగ్ గానే ఉండబోతోంది

Also Read : తేజ్ బ్రదర్స్ ప్రయత్నాలు మంచివే కానీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి