iDreamPost

బాలయ్య వారసుడికి లైన్ క్లియర్

బాలయ్య వారసుడికి లైన్ క్లియర్

నందమూరి మూడో తరంలో రెండో వారసుడిగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎదురు చూస్తున్న బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రం త్వరలో జరగబోతోందన్న వార్త ఊపందుకుంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడిన బాలయ్య దేవుళ్ళు దీవించినప్పుడు జరుగుతుందని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. అంటే వెనక ప్లానింగ్ అయితే జరుగుతోందన్న క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే ఎవరు పరిచయం చేస్తారా అనే ఆసక్తి ఫ్యాన్స్ లో మొదలైంది. సాయి మాధవ్ బుర్రా ఇప్పటికే కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారని ఒక టాక్ ఉండగా అనిల్ రావిపూడి, క్రిష్, పూరి ఇలా మూడు నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు మరో న్యూస్.

నాలుగేళ్ల క్రితమే వారాహి అధినేత సాయి కొర్రపాటి మోక్షజ్ఞను లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ‘రానే వచ్చాడు మా రామయ్య’ టైటిల్ ని రిజిస్టర్ కూడా చేసి ఉంచుకున్నారు. కొన్ని ఇంటర్వ్యూలలో నేనే లాంచ్ చేస్తానని కూడా చెప్పారు. కాని అది కార్యరూపం దాల్చలేదు. ఆ టైటిల్ కూడా ఇప్పుడు ఎక్స్ పైర్ అయ్యుంటుంది. సో ఇప్పుడు నిర్మాణం ఎవరు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ ఏడాదిలోనే జరిగితే సంతోషమే. మోక్షజ్ఞ వయసు పాతికేళ్ళు నిండింది. ఇప్పుడు మొదలుపెడితే ఓ నాలుగైదు ఏళ్ళలో సెటిలైపోవచ్చు. రామ్ చరణ్ లాగా రెండో సినిమాకే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ పడితే ఇంకా వేగంగా కుదురుకోవచ్చు. కాకపోతే సరైన దర్శకులు దొరకాలి.

బాలయ్య ఏకైక వారసుడిగా మోక్షజ్ఞ మీద చాలా అంచనాలు ఉన్నాయి. కాని తనకు నటన పెద్దగా ఆసక్తి లేదని, ఫిట్ నెస్ విషయంలోనూ అంతగా శ్రద్ధ చూపడం లేదని ఆ మధ్య కొన్ని కథనాలు వచ్చాయి కాని తాజాగా బాలకృష్ణ మాటలను బట్టి చూస్తే తెరపైకి తీసుకురావడం ఖాయమే అని తెలుస్తోంది. జూన్ 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ ప్రకటన ఏమైనా ఉంటుందా అనే ఆశలో ఫ్యాన్స్ ఉన్నారు కాని ఆ రోజు బోయపాటి సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేసే ఛాన్స్ ఉంది. సో మోక్షజ్ఞ రావడం దగ్గరలోనే ఉంది కాని అది ఎప్పుడు అన్నది మాత్రం ఒక్క బాలకృష్ణకే తెలుసు. తన సమకాలీకుల్లో చిరంజీవి, నాగార్జునలు తమ వారసులను దించేశారు. ఇప్పుడు బాలకృష్ణ తర్వాత వంతు వెంకటేష్ దే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి