iDreamPost

ఏపీ చరిత్రలో మరో మైలు రాయికి నేడు నాంధి

ఏపీ చరిత్రలో మరో మైలు రాయికి నేడు నాంధి

పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలతో దేశం దృష్టిని ఆకర్షించిన ఏపీలోని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో చారిత్రక కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టుబోతోంది. 1920 తర్వాత మళ్లీ తొలిసారి భూముల రీ సర్వే జరుగుతోంది. సమగ్ర భూ సర్వే ద్వారా ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలు, సరిహద్దు వివాదాలు పరిష్కారం కాబోతున్నాయి. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, మరియు భూ రక్ష పథకం పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా భూ యజమానులకు శాశ్వత హక్కులు కల్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం తక్కెళ్లపాడులో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రోజు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.

భూ సర్వే ఆలోచన పుట్టింది అక్కడే..

స్వాతంత్రం వచ్చి 74 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ బ్రీటీషు కాలం నాటి భూ రికార్డులే అందుబాటులో ఉన్నాయి. ప్రతి 30 ఏళ్లకు ఒక సారి భూముల రీ సర్వే చేసి రికార్డులను సఛ్చీకరణ చేయాల్సి ఉండగా.. ఆ పని జరగలేదు. మూడు, నాలుగు తరాలు మారడం, క్రయ విక్రయాలు జరగడంతో అనేక భూ వివాదాలు తలెత్తాయి. వీటి పరిష్కారం కోసం అటు అధికారులు, ఇటు భూ యజమానులు తలలుపట్టుకుంటున్నారు. అంతేకాకుండా అవినీతికి ఆస్కారం ఏర్పడుతోంది. కోర్టుల్లో ఏళ్ల తరబడి సివిల్‌ కేసులు నడుస్తున్నాయి. భూ సమస్యల అంశం ప్రజా సంకల్ప పాదయాత్రలో సీఎం జగన్‌ దష్టికి ప్రతి గ్రామంలో వచ్చాయి. దీంతో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రైతులకు రూపాయి ఖర్చు లేకుండా భూములు రీ సర్వే చేసి వారికి యాజమాన్య హక్కులు శాశ్వతంగా కల్పిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు.

ఉచితంగా సర్వే సేవ..

పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేసే లక్ష్యంతోనే.. కొత్తగా ఏర్పాటు చేసిన 11,158 గ్రామ సచివాలయాల్లో సర్వేయర్లను నియమించారు. గతంలో మండలానికి ఒకరు చొప్పన సర్వేయర్‌ ఉండగా.. ప్రస్తుతం ప్రతి గ్రామ సచివాలయానికి ఒక సర్వేయర్‌ అందుబాటులో ఉన్నారు. కంటిన్యూస్‌లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్‌ (కార్స్‌) అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో భూముల రీ సర్వే చేయనున్నారు. ఇందుకు సంబంధించి సర్వేయర్లకు శిక్షణ జరుగుతోంది. మండలం యూనిట్‌గా మూడు దశల్లో భూముల రీ సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియలో రైతులు ఎలాంటి సేవా రుసుము ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో 1.63 లక్షల చదరపు కిలోమీటర్ల ఉండగా… అటవీ భూమి పోను 1.22 లక్షల చదరపు కిలోమీటర్ల భూమిని రీ సర్వే చేయబోతున్నారు. సమగ్ర సర్వేను మూడు దశల్లో 2023 జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి