iDreamPost

ఇటలీ : సముద్రంలో కొట్టుకుపోయి కర్నూల్ విద్యార్థి మృతి

ఇటలీ : సముద్రంలో కొట్టుకుపోయి కర్నూల్ విద్యార్థి మృతి

ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడ సముద్రంలో గల్లంతై మృతి చెందాడు. కర్నూల్ లోని బాలాజీనగర్ బాలాజీ అపార్ట్ మెంట్లో నివసిస్తున్న చిలుమూరు శ్రీనివాసరావు, శారద దంపతుల పెద్దకొడుకు దిలీప్ (24) ఇటలీలోని మిలాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్‌ చదువేందుకు 2019లో ఇటలీ వెళ్లాడు. గతేడాది ఏప్రిల్ లో కర్నూల్ కు వచ్చిన దిలీప్.. తిరిగి సెప్టెంబర్లో ఇటలీకి వెళ్లాడు. అక్కడ తను చదువుతున్న కోర్సు పూర్తవ్వగా.. ఉద్యోగం తెచ్చుకున్నాక ఇంటికి వస్తానని ఇటీవలే తల్లిదండ్రులకు చెప్పాడు. కొడుకు చదువు పూర్తవ్వడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

మరోవైపు పీజీ పూర్తైన సందర్భంగా.. దిలీప్ శుక్రవారం (జూన్10) మాంటెరుస్సో బీచ్ కు వెళ్లాడు. సాయంత్రం వరకూ అక్కడే ఉన్నాడు. ఏమరపాటుగా ఒడ్డున కూర్చుని ఉన్న దిలీప్ ను పెద్ద అలలు సముద్రంలోకి లాక్కెళ్లాయి. గమనించిన కోస్టుగార్డు సిబ్బంది దిలీప్ ను రక్షించేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. కాసేపటికి దిలీప్ మృతదేహం లభ్యమైంది. అతని వివరాలు తెలుసుకుని, తల్లిదండ్రులకు దిలీప్ చనిపోయిన విషయాన్ని ఫోన్ చేసి తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇక లేడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి