iDreamPost

మార్చిలో ‘సాగర్‌’ ఉప ఎన్నిక? సిద్ధంగా ఉండాలని గులాబీ బాస్‌ సూచన!

మార్చిలో ‘సాగర్‌’ ఉప ఎన్నిక? సిద్ధంగా ఉండాలని గులాబీ బాస్‌ సూచన!

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అక్కడ పోటీ చేయాలనుకునేవారు, రాజకీయ పక్షాలు ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గంపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక మార్చి నెలలో జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఏపీ రాష్ట్రంలోని తిరుపతి ఎంపీ దుర్గాప్రసాదరావు సెప్టెంబరు చివరి వారంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆ లోక్‌సభ స్థానానికి మార్చిలో ఉప ఎన్నిక జరిగితే, దానితోపాటే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు, సాగర్‌ నియోజకవర్గ శ్రేణులంతా ఎన్నికల మూడ్‌లోనే ఉండాలని గులాబీ బాస్‌ కేసీఆర్‌ జిల్లా నాయకులకు సూచించినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని ఆదేశాలు

హామీ ఇచ్చిన, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానిక నాయకులకు కేసీఆర్‌ సూచించారు. అందుకు కావాల్సిన నిధులను విడుదల చేస్తామన్నారు. దీంతో పార్టీకి చెందిన కీలక నేతలంతా అప్రమత్తమయ్యారు. సాగర్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నేతల వరుస పర్యటనలు జరిగేలా ప్రణాళికలు రూపొందించారు. ఉపఎన్నిక నోటిఫికేషన్‌ వెలువడే సమయానికి నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి కనీసం రూ.100 కోట్ల విలువైన అభివృద్ధి నిధులు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. నియోజకవర్గంలో 2.22 లక్షల ఓట్లు ఉండగా, సామాజిక వర్గాల పరంగా ఎస్టీ (లంబాడ)ల ఓట్లు 30 వేలు, ఎస్సీలవి 30 వేలు, యాదవులవి 27 వేలు, రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారివి 23 వేల ఓట్లు ఉన్నాయి. అఽధికార పార్టీ నుంచి నోముల కుటుంబానికి, లేదంటే రెడ్డి సామాజిక వర్గానికి టికెట్‌ దక్కే అవకాశం ఉందని గులాబీ నేతలు బెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి