iDreamPost

Jr NTR : యంగ్ టైగర్ ప్లానింగ్ మాములుగా లేదు

Jr NTR : యంగ్ టైగర్ ప్లానింగ్ మాములుగా లేదు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోని తెరమీద చూసుకుని మూడున్నరేళ్లు దాటింది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత బుల్లితెరపై తప్ప సిల్వర్ స్క్రీన్ మీద తారక్ దర్శనం లేకుండా పోయింది. అటు చూస్తేనేమో ఆర్ఆర్ఆర్ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది కానీ ఫలానా డేట్ కి రిలీజవుతుందని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దానికి కారణాలు ఉన్నప్పటికీ ఫ్యాన్స్ బాధ మాత్రం వర్ణనాతీతం. ఎంతో విలువైన సమయాన్ని మిస్ చేసుకున్న జూనియర్ ఈ గ్యాప్ లో ఎంతలేదన్నా మూడు సినిమాలు చేసే అవకాశం ఉండేది. కేవలం రాజమౌళి కోసం చేసిన త్యాగం ఇక్కడి దాకా తీసుకొచ్చింది.

ఇప్పుడీ గ్యాప్ ని రిపేర్ చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సబ్జెక్టు ఆల్రెడీ లాక్ అయ్యింది. రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. ఆచార్య తాలూకు పనులు పెండింగ్ ఉండటంతో కొరటాల ఫ్రీ కాలేదు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో బిజీ కావడంతో షెడ్యూల్స్ ని ప్లాన్ చేయడంలో ఆలస్యం జరిగింది. తాజాగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు పేరు లైన్ లోకి వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద రూపొందబోయే భారీ చిత్రం కూడా సమాంతరంగా షూట్ జరిగేలా తారక్ ఆలోచిస్తున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. ఆ దిశగా ప్రణాళిక జరుగుతోందట.

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ని దీని ద్వారానే టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నారని తెలిసింది. అయితే ఆమె ఒప్పుకుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఈ లెక్కన జూనియర్ రెండు సినిమాలు ఇలా లైనప్ లో పెట్టడం మంచిదే. ఎలాగూ ఈ ఏడాదికి ఆర్ఆర్ఆర్ తో మాత్రమే సర్దుకోవాలి. కనీసం వచ్చే సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకోవచ్చు. వీటి తర్వాత ప్రశాంత్ నీల్ తో సెట్ చేసుకున్న పాన్ ఇండియా మూవీ ఉంది. ఇది కూడా వీలైనంత త్వరగా స్టార్ట్ చేస్తారని తెలిసింది. ఇకపై వేగంగా సినిమాలు చేయాలని జూనియర్ నిర్ణయించుకోవడం మంచిదే. స్టార్ హీరోలు ఏడాదికి ఒకటే చేయడం ఇప్పటికే ప్రభావం చూపిస్తోంది

Also Read : Ava : ఆహా రూటులో అవా వస్తోందా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి