iDreamPost

పార్టీ అధ్యక్షుడు అలా.. ఎమ్మెల్యే ఇలా.. చర్యలు ఉంటాయా..?

పార్టీ అధ్యక్షుడు అలా.. ఎమ్మెల్యే ఇలా.. చర్యలు ఉంటాయా..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు ఆది నుంచి మద్దతు తెలుపుతున్న జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌ మూడు రాజధానుల అంశంపై కూడా తన వైఖరిని మరో మారు స్పష్టం చేశారు. నేడు అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే రాపాక మరోమారు మూడు రాజధానులకే జై కొట్టారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో తాను పాల్గొంటానని, ఓటింగ్‌ జరిగితే మూడు రాజధానులకు మద్దతుగా ఓటు వేస్తానన్నారు.

రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని రాపాక నొక్కి చెప్పారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాగా జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాత్రం మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటనలు చేశారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో జనసేన పార్టీ వైఖరికి భిన్నంగా ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌ వ్యవరిస్తే… అనంతర పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఎమ్మెల్యేపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటారా..? లేదా..? అన్నది సమావేశాలు ముగిసిన తర్వాత తేలనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి