iDreamPost

డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మరో ‘జబర్దస్త్’ కమెడియన్!

  • Author Soma Sekhar Published - 11:40 AM, Fri - 23 June 23
  • Author Soma Sekhar Published - 11:40 AM, Fri - 23 June 23
డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మరో ‘జబర్దస్త్’ కమెడియన్!

జబర్దస్త్.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్న ఖతర్నాక్ కామెడీ షో. ఇక ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం వారిలో చాలా మంది వెండితెరపై నటులుగా రాణిస్తున్నారు. మరికొంతమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాజాగా జబర్దస్త్ ఫేమ్ వేణు బలగం సినిమా ద్వారా డైరెక్టర్ గా మారి.. సూపర్ సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే దారిలో నడుస్తున్నారు మరో జబర్దస్త్ నటుడు. త్వరలోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఆ కమెడియన్. ఈ మూవీలో సాయి కుమార్ తో పాటుగా ఆయన కొడుకు ఆది సాయికుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన వారు నటులుగా, రైటర్లుగా, దర్శకులుగా మారుతున్నారు. ఇప్పటికే షకలక శంకర్, సుడిగాలి సుధీర్, మహేష్ ఆచంటలు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మరోవైపు హైపర్ ఆది నటుడిగా చేస్తూనే కొన్ని చిత్రాలకు రైటర్ గా కూడా పనిచేశారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ వేణు బలగం సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్నారు. ప్రస్తుతం మరో జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయనే శాంతి కుమార్.. మిమిక్రీ ఆర్టిస్టుగా, కమెడియన్ గా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడే.

ప్రస్తుతం శాంతి కుమార్ దర్శకత్వంలో ‘నాతో నేను’ అనే సినిమా రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో సాయి కుమార్, ఆదిత్య ఓం, దీపాలి రాజ్ పుత్, శ్రీనివాస్ సాయి, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు హీరో ఆది సాయికుమార్. ఇక ఈ సినిమాకు దర్శకత్వంతో పాటుగా కథ, మాటలు, పాటలు కూడా శాంతి కుమారే సమకూర్చడం విశేషం. కాగా మరో జబర్దస్త్ నటుడు కిర్రాక్ ఆర్పి సైతం డైరెక్టర్ గా మారి జేడీ చక్రవర్తి, రావు రమేష్ కీలక పాత్రదారులుగా ఓ సినిమాని ప్రారంభించిన విషయం తెలిసిందే. భవిష్యత్ లో ఇంకెంత మంది కమెడియన్లు డైరెక్టర్లుగా మారుతారో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి