iDreamPost

బాలీవుడ్ భామకు మెగా ఛాన్స్ ?

బాలీవుడ్ భామకు మెగా ఛాన్స్ ?

నిన్నటి తరాన్ని ఏలిన నలుగురు స్టార్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం దర్శకులకు రాను రాను పెద్ద సవాల్ గా మారుతోంది. ఇప్పటి జెనరేషన్ బ్యూటీలు వీళ్ళతో నటిస్తే కెరీర్ తగ్గిపోతుందని భయపడుతుండగా పాత హీరోయిన్లను తీసుకుంటే మార్కెట్ చిక్కులతో పాటు అభిమానుల అంచనాలు కూడా మ్యాచ్ కావు. అందుకే కేవలం ఈ ఎంపిక కారణంగానే రెండు మూడు నెలలు ఆలస్యంగా మొదలైన సినిమాలు ఉన్నాయి. ప్రతిసారి ఈ కసరత్తు చేయక తప్పడం లేదు. అంతేకాదు ఒప్పుకున్న వాళ్ల స్థాయిని మించి రెమ్యునరేషన్ సమర్పించుకోక తప్పడం లేదు. అందులోనూ చిరు బాలయ్యలకు ఇదో పెద్ద సమస్యగా మారింది.

ఆచార్య, లూసిఫర్ రీమేక్ తర్వాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమాలో సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా ఎంచుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకా అఫీషియల్ కాలేదు కానీ ముందైతే మాట్లాడి పెట్టారట. గతంలో తను రజనీకాంత్ లింగలో చేసింది. బొమ్మ డిజాస్టర్ కావడంతో తనకు పెద్దగా గుర్తింపు రాలేదు. దానికి తోడు అనుష్క మెయిన్ హీరోయిన్ కావడం కూడా మైనస్ అయ్యింది. సల్మాన్ ఖాన్ లాంటి ఏజ్ బార్ హీరోలతో చేసిన ఎక్స్ పీరియన్స్ కూడా తనకు ఉంది. అందుకే సోనాక్షి సిన్హా అయితేనే చిరుకి సరైన జోడి కాగలదని భావించిన బాబీ అండ్ మైత్రి యూనిట్ ఆ మేరకు ఓకే అనుకున్నారట.

ఇదంతా బాగానే ఉంది కానీ మెహర్ రమేష్ డైరెక్షన్ లో చేయాల్సిన వేదాలం రీమేక్ తాలూకు వార్తలు మాత్రం బయటికి రావడం లేదు. అసలు ఉంటుందా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో లేకపోలేదు. కానీ రమేష్ మాత్రం దీనికి సంబందించిన స్క్రిప్ట్ పనులు లొకేషన్ల వేట తదితర పనులన్నీ చేసుకుంటున్నారట. అసలు కరోనా సెకండ్ వేవ్ రాకపోయి ఉంటే ఆచార్య విడుదలైపోయి లూసిఫర్ సగానికి పైగా ఫినిష్ అయ్యేది. కానీ జరిగింది వేరు. ఇంకా ఆచార్యనే నెలరోజులకు పైగా వర్క్ పెండింగ్ ఉంది. లూసిఫర్ రీమేక్ ని దసరాకు మొదలుపెట్టే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మూడు నెలలలోపే మొత్తం పూర్తి చేస్తారట

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి