iDreamPost

విజయాల విజిల్ పోడు!

విజయాల విజిల్ పోడు!

విజిల్ పోడు నినాదంతో చెన్నై విజయాల కూత పెడుతోంది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్లు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ 2018 లో ఐపీఎల్ లోకి పునరాగమనం చేసిన, అనుకున్న మేరా ప్రభావం చూపలేకపోయింది. 2019, 2020 సంవత్సరాల్లోనూ చెన్నై ఆట అంతంతమాత్రంగానే అనిపించింది. అయితే ఇప్పుడు 2021లో చెన్నై సూపర్ కింగ్స్ పాత ఆటతీరుతో మైమరిపిస్తుంది. బౌలింగ్ బ్యాటింగ్ రెండింటిలోనూ తనకు తిరుగు లేదు అన్నట్లుగా చెలరేగిపోతుంది. బుధవారం జరిగిన రెండో మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా నైట్రైడర్స్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆశలు నెరవేరలేదు. చెన్నై జట్టు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రూతు రాజ్ గైక్వాడ్, డు ప్లేసెస్ ఇద్దరూ ప్రాజెక్టుకు అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. ఒకరికి ఒకరు పోటీ పడుతూ బౌండరీలు సాధించాడు. కోల్కతా బౌలర్లను మారుతున్నప్పటికీ ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఓవర్కు 10 రన్స్ ఉండేలా, బౌండరీలు మోత మోగిస్తూ ఓపెనర్లు ఇద్దరు ఆడుతూ పాడుతూ పరుగులు సాధించారు. యువ బ్యాట్స్మెన్ రూతు రాజ్ తనకు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా మలుచుకుని చక్కటి కవర్ డ్రైవ్ లతో బౌండరీలు సాధించాడు. 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గైక్వాడ్ వెనుదిరిగాడు. అయితే అప్పటికే చెన్నై స్కోర్ 100 దాటడంతో భారీ స్కోర్ సాధన సులభం అయింది. ఓపెనర్ వికెట్ తరువాత క్రీజులోకి వచ్చిన మొయిన్ అలీ సైతం బాట్ కు పని చెప్పి ఉన్నంత సేపు బౌండరీలు సాధించాడు. అలీ తర్వాత మిడిలార్డర్లో బ్యాటింగ్కు రావాల్సిన రైనా, రాయుడు ల కంటే ముందుగా కెప్టెన్ ఎంఎస్ ధోని మైదానంలోకి అడుగు పెట్టాడు. 7 బాల్స్ ఎదుర్కొని 15 రన్స్ చేసిన ధోని అనుకోని షాట్ కొట్టి క్యాచ్ అవుట్ అయ్యాడు. చివర్లో జడేజా సిక్స్ తో ముగించడం తో చెన్నై స్కోర్ 220 పరుగులు వరకు వెళ్ళింది. ఓపెనర్ డూ ప్లేసెస్ 95 రన్స్ చేసాడు. 20 ఓవర్లు క్రీజులో ఉన్నప్పటికీ సెంచరీ చేయలేకపోయాడు. చెన్నైలోని కీలకమైన మిడిలార్డర్ బ్యాట్స్మెన్ లు ఏ మాత్రం క్రీజులోకి రాకుండానే చెన్నై ఇంత భారీ స్కోరు సాధించడం ఇదే ప్రథమం.

అనంతరం 221 పరుగుల భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కోల్కతా నైట్ రైడర్స్ పరుగులు చేదన లో పూర్తిగా తడబడింది. ఓపెనర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. మొదటి బాల్ కే గిల్ వికెట్ కోల్పోతే తర్వాత వచ్చిన త్రిపాఠి, మోర్గాన్, రానా, నరైన్ వంటి వారు వెంటనే అవుట్ అవ్వడం తో కోల్కతా నైట్రైడర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. చెన్నై బౌలర్ దీపక్ చాహర్ మరొమారు అద్భుతమైన ప్రదర్శన చేశాడు. కోల్కతా లోని టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందర్నీ అవుట్ చేయడంతో 31 స్కోర్ కే 5 వికెట్స్ పడ్డాయి. దీనిలో దీపక్ తీసినవే 4 వికెట్లు ఉండడం విశేషం. భారీ స్కోరు కళ్ళముందు ఉన్నప్పటికీ కోల్కతా నైట్రైడర్స్ బ్యాట్స్మెన్ పరుగులు తీయడానికి బాట్ ఝలిపించడానికి ఏమాత్రం కుదర్లేదు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కనీసం సింగిల్ తీయడానికి కూడా చాలా కష్టపడ్డారు. ఫాస్ట్ బౌలింగ్ వేసే సీమర్లు అంతా సూపర్ లెంగ్త్ తో బౌలింగ్ వేయడం కోల్కతా ను కట్టి పడేసినట్లు చేసింది. మధ్యలో అండ్రు రాసేల్ మెరుపులు మెరిపించాడు. సిక్స్ లు ఫోర్ల మోతతో కాస్త కేకే ఆర్ అభిమానులకు ఆశలూ కలిగించాడు. 22 బాల్స్ లో 54 రన్స్ చేసిన అతడు సామ్ కరన్స్ బౌలింగ్ లో లెగ్ స్టంప్ వైపు వస్తున్న బంతిని తప్పుగా అంచనా వేయడంతో క్లీన్బౌల్డ్ అయ్యాడు. అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయిన పరిస్థితిలో కోల్కతా నైట్రైడర్స్ కు ఇక అపజయం ఖాయమైంది. కొద్దిసేపు 200 వ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న దినేష్ కార్తీక్ పోరాడిన, అప్పటికే వికెట్లు అన్ని పడిపోవడంతో అతడు ఏమీ చేయలేకపోయాడు. చివర్లో వచ్చిన పాట్ కమిన్స్ ఒకే ఓవర్ లో నాలుగు సిక్స్ లు వేసాడు. దింతో లక్ష్యం దగ్గరకు వచ్చినట్లు అనిపించింది. 23 బాల్స్ లో హాఫ్ సెంచరీ సాధించిన ఈ ఆల్ రౌండర్ కాస్త ఓవర్లు ఉండగా వచ్చి పోరాటం చేసి ఉంటే ఫలితం వేరేగా ఉండేదాని చెప్పాలి. కమిన్స్ పోరాడిన అప్పటికే ఓవర్లు, వికెట్లు లేకపోవడంతో కోల్కతా కు ఓటమి తప్పలేదు. దింతో కోల్కతా కథ 202 వద్ద ముగిసింది.

గురువారం ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు మధ్య మ్యాచ్ జరగనుంది. వరుసగా మూడు మ్యాచ్ల్లో నెగ్గి మంచి ఊపు మీద కనిపిస్తున్న బెంగళూరు టీం ఇదే స్ఫూర్తితో ముందుకు దూసుకు వెళ్లాలని భావిస్తోంది. మరోపక్క వరుస అపజయాలతో డీలా పడిన రాజస్థాన్ జట్టు ఖచ్చితంగా ఒక విజయం సాధించి మళ్లీ ఫామ్లోకి రావాలని తాపత్రయపడుతోంది. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది అనడంలో సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి