iDreamPost

కరోనా కేసుల్లో ఇటలీని అధిగమించి ఆరో స్థానానికి చేరిన భారత్

కరోనా కేసుల్లో ఇటలీని అధిగమించి ఆరో స్థానానికి చేరిన భారత్

ఒక్కరోజులో 9,887 పాజిటివ్ కేసులు-294 మరణాలు

కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా రోజుకి 8వేలకు పైగా కేసులు, 200 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. కాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 9,887 కేసులు నిర్దారణ కాగా, 294మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,36,657కు కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 6,642 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో ఇటలీని వెనక్కి నెట్టి భారత్ ఆరవ స్థానానికి చేరుకుంది. కరోనా వైరస్ బారినుండి 1,14,072 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 1,15,942 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో 2436 పాజిటివ్ కేసులు నిర్దారణ

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు.గత కొద్దిరోజులుగా రోజుకు రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 2933 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 80229 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 2849 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 46,080 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. 1,519 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా 143 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 3290 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1550 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 1627 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 113 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 138  కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 4250 మందికి కరోనా సోకగా 73 మంది మృత్యువాత పడ్డారు. 2565మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,612యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 6,850,473 మందికి కోవిడ్ 19 సోకగా 398,244 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 3,351,249 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,965,708 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 111,390 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి