iDreamPost

గుజరాత్ ఎమ్మెల్యే కు పాజిటీవ్,ముఖ్యమంత్రికి కరోనా పరీక్షలు

గుజరాత్ ఎమ్మెల్యే కు పాజిటీవ్,ముఖ్యమంత్రికి కరోనా పరీక్షలు

గుజరాత్‌కు చెందిన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. అహ్మదాబాద్‌లోని జమల్‌పూర్-ఖడియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇమ్రాన్ ఖేడ్వాలాకు కోవిడ్-19 సోకినట్లు మంగళవారం రాత్రి నిర్ధారణ అయ్యింది. అయితే ఆయన నిన్న మధ్యాహ్నం గాంధీనగర్‌లోని సెక్రటేరియల్‌లో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం విజయ్ రూపానీ,డిప్యూటీ సీఎం నితిన్ పటేల్,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రదీప్ సింగ్ జడేజాను కలిశారు.

ఇమ్రాన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న జమల్‌పూర్ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు ఎక్కువగా ఉంది.ఈ కారణంగా నిన్న ప్రభుత్వ పెద్దలతో సమావేశమైన వీరందరూ కలిసి అహ్మదాబాద్‌లో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు.ఈ సమావేశం అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కోవిడ్ -19 కేసుల కట్టడి కోసం బుధవారం ఉదయం 6 గంటల నుండి అహ్మదాబాద్‌లోని పాత నగరం,డానిలింబాడా ప్రాంతాలలో కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించారు.

నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఖేడ్వాలాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.ఈ వార్త బయటకు రాగానే గుజరాత్ లో రాజకీయ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి.ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్వీపీ హాస్పిటల్‌లో వైద్య సేవలు పొందుతున్నారు.సీఎంతో సమావేశమైన మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు శైలేష్ పర్మార్,జ్ఞాసుద్దీన్ షేక్ అని తెలుస్తుంది.ఇద్దరు ఎమ్మెల్యేలను సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపారు.

ముందుజాగ్రత్తగా నేడు గుజరాత్ సిఎం విజయ్ రూపానీతో పాటు సమావేశంలో పాల్గొన్న అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు.

సీఎంతో భేటీలో పాల్గొన్న నేతలు సామాజిక దూరం పాటించారని ప్రభుత్వం ప్రకటించింది.కానీ అహ్మదాబాద్ మిర్రర్ దగ్గరున్న ఫొటోలను చూస్తే నేతలు సామాజిక దూరం పాటించలేదని అర్థమవుతుంది.పైగా నేతలంతా మాస్కులు తీసేసి ఉండటంతో లాక్‌డౌన్ నిబంధనలు ప్రజలకేనా…?నాయకులకు వర్తించవా…? అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి