నిత్యం దేశ విదేశాల నుంచి తిరుమలకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. అలా స్వామి వారి దర్శన అనంతరం స్థానికంగా ఉండే వివిధ ఆలయాలను సందర్శిస్తుంటారు. ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు ముఖ్యంగా ఆలయాల్లో సేవ టిక్కెట్లు, ప్రసాదం వంటి ఇతర వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడుతుంటారు. చిల్లర సమస్యగా మారుతుండేది. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందేలా శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మరి… ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
తిరుపతి పరిసరాల్లో ఉండే స్థానిక ఆలయాలు, అలానే బయటి ప్రాంతాల్లోని ఆలయాల్లో సేవ టిక్కెట్లు, ప్రసాదాలు, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, డైరీలు, క్యాలెండర్లు కొనుగోలు చేసే భక్తుల సౌకర్యార్థం ఫోన్ పే, క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా, అలానే యుపిఐ, డెబిట్ కార్డు ద్వారా చెల్లించేందుకు చర్యలు చేపట్టారు. ఇదే విషయంపై జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. శనివారం వివిధ ఆలయాల అధికారులతో జేఈవో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. పలు ఆదేశాలు కూడా జారీ చేశారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ అనుబంధ దేవాలయల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగ అధికారులను ఆదేశించారు. యాత్రికులు ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్, బస్టాండు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో టీటీడీ ఆలయాల గురించి సులభంగా తెలిసేలా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా యాత్రికులు ఈజీగా ఆలయాలకు విచ్చేసి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటారని జేఈవో తెలిపారు.
స్థానిక ఆలయాల్లో కల్యాణోత్సవంతో పాటు ఇతర ఆర్జిత సేవలు ప్రారంభించేందుకు గల అవకాశాలను పరిశీలించి రిపోర్ట్ అందించాలన్నారు. భక్తులకు ఆలయాల్లో మరింత ఆధ్యాత్మిక ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు పెంచాలని డిఎఫ్వోను ఆదేశించారు. ప్రతి ఆలయంలో పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు. మరి..టీటీడీ తీసుకున్న ఈ కీలక నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.