iDreamPost

నా లైఫ్​లో ఆ తప్పును మర్చిపోలేను.. ఇప్పటికీ సిగ్గుపడుతున్నా: గంభీర్

  • Author singhj Published - 07:17 PM, Thu - 24 August 23
  • Author singhj Published - 07:17 PM, Thu - 24 August 23
నా లైఫ్​లో ఆ తప్పును మర్చిపోలేను.. ఇప్పటికీ సిగ్గుపడుతున్నా: గంభీర్

గౌతం గంభీర్.. క్రికెట్​కు భారత్ అందించిన ఆణిముత్యాల్లో ఒకడు. టీమిండియాకు ఆడిన అత్యుత్తమ లెఫ్టాండర్ బ్యాటర్లలో గౌతీ ఒకడని నిస్సందేహంగా చెప్పొచ్చు. మూడు ఫార్మాట్లలోనూ భారత్​కు అతడు అందించిన సేవలు అపూర్వం. టీ20, వన్డే వరల్డ్ కప్స్ గెలిచిన టీమిండియాలో అతడు కీలక సభ్యుడు. టెస్టుల్లోనూ జట్టులో ముఖ్య భూమిక పోషించాడు. సహచర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్​తో కలసి ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. భారత జట్టులోని బ్యాటర్లు అందరూ విఫలమైన అనేక మ్యాచుల్లో గంభీర్ ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.

టీ20 ప్రపంచ కప్-2007 ఫైనల్లో దాయాది పాకిస్థాన్​పై 54 బంతుల్లో 75 రన్స్ చేసిన గంభీర్​ను ఎవరూ మర్చిపోలేరు. అలాగే సొంతగడ్డపై శ్రీలంకతో వన్డే వరల్డ్ కప్-2011 ఫైనల్లో తీవ్రమైన ఒత్తిడిలోనూ 122 బంతులు ఎదుర్కొని విలువైన 97 రన్స్ చేశాడు. వరల్డ్ కప్స్ గెలవడంలో ఈ రెండు ఇన్నింగ్స్​లు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి గంభీర్ ఒక మ్యాచ్​లో మాత్రం ఒత్తిడిని అధిగమించలేకపోయాడట. కోల్​కతా నైట్ రైడర్స్ కెప్టెన్​గా ఉన్న టైమ్​లో 2014లో వరుసగా మూడుసార్లు డకౌట్ అయ్యాడు గౌతీ. దీంతో నాలుగో మ్యాచ్​లో ఓపెనింగ్ చేయాలంటే అతడికి భయం వేసిందట.

ఐపీఎల్​-2014లో కేకేఆర్ ఆడిన నాలుగో మ్యాచ్​లో తనకు బదులుగా ఓపెనింగ్ చేయమని మనీశ్ పాండేను అడిగాడట గంభీర్. తనలో ఉన్న భయం, తీవ్ర ఒత్తిడి కారణంగానే మనీష్​ను ప్రమోట్ చేశానని తాజాగా గౌతీ రివీల్ చేశాడు. ఈ పని చేసినందుకు ఇప్పటికీ తాను సిగ్గుపడుతున్నానని అన్నాడు. ఆ మ్యాచ్​లో మనీశ్ డకౌట్​గా వెనుదిరిగాడని.. తాను కూడా ఒక్క రన్​కే ఔట్ అయ్యానని గంభీర్ గుర్తుచేసుకున్నాడు. మ్యాచ్ తర్వాత మనీశ్​ను పిలిచి ఈ తప్పు ఇంకెప్పుడూ చేయనని చెప్పానని ఒక స్పోర్ట్స్ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతీ పేర్కొన్నాడు. కాగా, ఐపీఎల్​-2014లో గంభీర్ టీమ్ ఛాంపియన్​గా నిలిచిన విషయం విదితమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి