iDreamPost

మరో వివాదంలో దర్శకుడు శంకర్

మరో వివాదంలో దర్శకుడు శంకర్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాలకు కాపీ చిక్కులు బాగా పెరిగిపోయాయి. నిర్మాణంలో ఉన్నప్పుడో లేదా విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడో ఫలానా కథ మాదని కొందరు రచయితలు కోర్టుకు వెళ్లడం, అసోసియేషన్ మెట్లు ఎక్కడం సాధారణమైపోయింది. ఆ మధ్య ఖైదీ నెంబర్ 150 విషయంలోనూ ఇలాంటి ఇబ్బందే ఎదురైతే దాన్ని ఎలాగోలా ముదరకుండా సెటిల్ చేసుకున్నారు. అఆ టైంలో త్రివిక్రమ్ మీద వచ్చిన కామెంట్లు అంత సులభంగా మర్చిపోలేం. నేనే రాజు నేనే మంత్రి కూడా ఈ తరహా కంప్లయింట్లను ఎదురుకున్నదే. తాజాగా రామ్ చరణ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకు సైతం ఈ సెగ తగలక తప్పలేదు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాక ముందే వచ్చేసింది.

సెల్లముత్తు అనే రైటర్ తమిళనాడు రచయితల సంఘంలో ఫిర్యాదు చేశాడు. దర్శకుడు శంకర్ తన అనుమతి లేకుండా కథను వాడుకున్నాడని, కార్తీక్ సుబ్బరాజ్ దగ్గర పని చేస్తున్నప్పుడు ఇది రాసుకున్నానని అందులో పేర్కొన్నాడు. తనకు పైసా చెల్లించకుండా వాళ్ళు తీసేసుకున్నారని ఆరోపిస్తున్నాడు. ఇప్పుడిది ఏ దిశగా వెళ్తుందో కానీ శంకర్ మాత్రం ఇంకా స్పందించలేదు. ఇటీవలే ఇండియన్ 2 విషయంలో పెద్ద కాంట్రావర్సీని ఎదురుకున్న ఈ దిగ్గజ దర్శకుడికి ఇదో కొత్త సమస్య. స్టోరీని కార్తీక్ సుబ్బరాజ్ నుంచి తీసుకున్న మాట వాస్తవమే కానీ అది సెల్లముత్తుదా కదా అని నిర్ధారణ కావాల్సి ఉంది.

ఈ నెల మూడో వారంలోనే రెగ్యులర్ షూట్ కు వెళ్ళబోతున్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుంది. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూరుస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ పనులు ఓ కొలిక్కి తీసుకొచ్చారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. రిలీజ్ లాంటి హడావిడి ఏమి లేదు కాబట్టి ఈ వివాదాన్ని ఈజీగా పరిష్కరించుకునే మార్గాలు ఉన్నాయి. దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఫహద్ ఫాసిల్ నటించవచ్చనే టాక్ ఉంది కానీ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. చూడాలి మరో ఈ కాపీ ఇష్యూ గురించి శంకర్ ఎలా రెస్పాండ్ అవుతాడో అని

Also Read : పవన్ పాట వెనుక 12 మెట్ల కిన్నెర

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి