iDreamPost

చిరంజీవి 153కి డైరెక్టర్ లాక్

చిరంజీవి 153కి డైరెక్టర్ లాక్

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ మూవీ మెగా 153కి లూసిఫర్ రీమేక్ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్ ప్రకారం దీనికి దర్శకుడు కూడా లాక్ అయిపోయాడు. సాహోతో జాతీయ లెవెల్ లో మీడియా దృష్టిని ఆకర్షించిన సుజిత్ నే డైరెక్టర్ గా ఫిక్స్ చేశారట. నిజానికి ఇంతకు ముందు వివి వినాయక్, హరీష్ శంకర్ అంటూ ఏవేవో పేర్లు వినిపించాయి. కానీ చిరు చరణ్ లకు సుజిత్ మీద గట్టి గురి ఉందట.

దీని వెనుక ప్రభాస్ ఉన్నాడని మరో వర్గం కథనం. సాహో ఆశించిన ఫలితం అందుకోనప్పటికీ సుజిత్ కష్టాన్ని గమనించిన ప్రభాస్ చరణ్ తో సినిమా చేయమని స్వయంగా పంపించాడట. అయితే ఆర్ఆర్ఆర్ తో పాటు తర్వాత ప్రాజెక్ట్స్ విషయంలో ఇంకా ఎలాంటి ఆలోచన చేయలేదు కాబట్టి నాన్నతో లూసిఫర్ రీమేక్ చేయమని తర్వాత మనమిద్దరం వర్క్ చేద్దామని చెప్పడంతో ఇప్పుడు సుజిత్ కి మెగా ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిసింది. చాలా కీలకమైన మార్పులు అవసరం పడటంతో వాటి తాలూకు చర్చలతో సుజిత్ టీమ్ తో చిరు చరణ్ లు నిత్యం వీడియో కాన్ఫరెన్సులు జరుపుతున్నారని వినికిడి.

ఆచార్య కనక త్వరగా అయిపోతే వీలైనంత వేగంగా దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. లూసిఫర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ గత ఏడాదే విడుదలైనప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. మలయాళంలో వంద కోట్లు సాధించిన ఈ మూవీ అక్కడ టాప్ 3లో నిలిచింది. ప్రైమ్ లో తెలుగు వెర్షన్ ని డిలీట్ చేయించే దిశగా చర్యలు చేపట్టారట. శాటిలైట్ టెలికాస్ట్ కాలేదు కాబట్టి ఆ టెన్షన్ లేదు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే లూసిఫర్ లో మోహన్ లాల్ చేసిన పవర్ ఫుల్ రోల్ చిరంజీవికి సూటవుతుంది కానీ మన నేటివిటికి తగ్గట్టు చాలా చేంజెస్ చేయాల్సి వస్తుంది. సుజిత్ మూడో సినిమాకే ఏకంగా చిరంజీవి డైరెక్ట్ చేయడం నిజంగా బంపర్ ఆఫరే. కరోనా గొడవ సద్దుమణిగాక దీనికీ సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి