iDreamPost

కోహ్లీ,ధోనీల ప్రతిభను గుర్తించి అవకాశం కల్పించింది నేనే:కల్నల్‌

కోహ్లీ,ధోనీల ప్రతిభను గుర్తించి అవకాశం కల్పించింది నేనే:కల్నల్‌

2006-08 వరకు చీఫ్‌ సెలెక్టర్‌గా పని చేసిన వెంగ్‌సర్కార్‌ సెలెక్షన్‌ కమిటీకి ఉన్నత ప్రమాణాలను నిర్దేశించి తనదైన ముద్ర వేశాడు. కోహ్లీకి జట్టులో స్థానం కల్పించి మహేంద్ర సింగ్ ధోనీకి జట్టు నాయకత్వ పగ్గాలు అప్పజెప్పి బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ తన ప్రత్యేకతను చాటాడు. ప్రస్తుతం ఉనికిలో లేని బీసీసీఐ టాలెంట్‌ రీసెర్చ్‌ డెవల్‌పమెంట్‌ వింగ్‌ హెడ్‌గా విధులు నిర్వర్తించిన తాను ఆ అనుభవంతో యువ ఆటగాళ్లను ప్రోత్సహించి సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ పదవికి తగిన న్యాయం చేశానని చెప్పాడు.ఆస్ట్రేలియా పర్యటనకు ఏమాత్రం అనుభవం లేని కోహ్లీని వెంగీ ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు.అండర్‌-16,అండర్‌-19 టోర్నీలలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రతిభను నిశితంగా గమనించానని సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన తర్వాత విరాట్‌ కోహ్లీకి జట్టులో స్థానం కల్పించానని తెలిపాడు. భవిష్యత్తులో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ ఎదుగుతాడని సంపూర్ణ విశ్వాసం ఆ రోజుల్లోనే తనకు ఉండేదని చెప్పాడు.

అండర్‌-19 మ్యాచ్‌ టాలెంట్‌ హంట్‌ పోగ్రామ్ సమయంలో పక్కన బిహార్‌ జట్టు రంజీ ఆడుతోంది. కొన్ని బంతులు స్టేడియం బయటకు రావడంతో ఎవరా? అని ఆరా తీయగా అప్పుడే ధోని గురించి తెలిసిందని చెప్పాడు. టీఆర్‌డీడబ్లూ స్కీమ్‌ కింద అండర్‌-19 క్రికెటర్లను మాత్రమే గుర్తించాలని ఉంది.అప్పటికి ధోనీ వయస్సు 21 ఏళ్లు.కానీ వయసు ఎక్కువైనా ప్రతిభ ఉన్న వాళ్లకు అవకాశాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో మహీకి ఆ స్కీమ్‌లో అవకాశం కల్పించినట్లు కల్నల్‌ చెప్పాడు.కాగా ఒకప్పుడు ఎంతో మంది ప్రతిభావంతులను తయారు చేసిన జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) ఇప్పుడు పునరావాస కేంద్రంగా మారడంపై వెంగ్‌సర్కార్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.ఇక యువ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌ టోర్నీలు ఎక్కువగా ఆడి తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి